మడికొండ, నవంబర్ 21 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గులాబీ సైన్యం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్లో సోమవారం ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 26 డివిజన్లకు చెందిన ముఖ్య నాయకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నగర మేయర్ గుండు సుధారాణి, రైతు రుణ విమోచన కార్పొరేషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు హాజరయ్యారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు కబడ్డీ, క్రికెట్, చెస్, క్యారమ్ తదితర క్రీడలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చీఫ్ విప్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కులవృత్తులకు ఆదాయం పెంచి, వారి అభ్యున్నతికి పాటుపడుతున్నారని తెలిపారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపట్టారని, పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించే చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు. దేశంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలను పాటిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతానని చెప్పారు. సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చారని గుర్తుచేశారు. చెరువులపై ఆధారపడిన మత్స్యకారులకు చేయూతనిచ్చేందుకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సోమవారం తొమ్మిది చెరువుల్లో చేప పిల్లలను వదిలినట్లు వివరించారు.
రూ.2,400కోట్లతో..
సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో రూ.5కోట్ల విలువైన పనులు కూడా చేయలేకపోయానని, తెలంగాణ వచ్చినంక సుమా రు రూ.2,400కోట్ల పనులు చేపట్టినట్లు చీఫ్విప్ తెలిపారు. ఆర్ అండ్ బీ శాఖ నుంచి మంజూరైన రూ.9కోట్లతో 12 పనులు చేయించామని, రూ.33కోట్లతో 505 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించామని, వీటిని త్వరలోనే లబ్ధిదారులకు కేటాయిస్తామన్నారు. అలాగే కుడా నుంచి మంజూరైన రూ.230కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా భద్రకాళి బయోడైవర్సిటీ పార్ కోసం రూ.50కోట్లు కేటాయించి తీర్చిదిద్దుతున్నామన్నారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు.
సీఎం కేసీఆర్ వైపు.. దేశం చూపు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో బీసీలకు మంత్రిత్వ శాఖ లేదని, ఎనిమిదేళ్ల పాలనలో కేంద్రం ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకొచ్చి ఇబ్బందులకు గురిచేస్తోందని చీఫ్ విప్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంట్తో రైతులను ఆదుకుంటున్నారని తెలిపారు. మునుగోడు ఎన్నికల తర్వాత దేశం కేసీఆర్ వైపు చూస్తున్నదని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీ గెలుపునకు కృషి చేస్తామని చెప్పారు. కేంద్రంలో కేసీఆర్ నాయకత్వంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం జరుగుతుందని, కాజీపేట కోచ్ఫ్యాక్టరీ, బయ్యారం ఉకుఫ్యాక్టరీ, ములుగు ట్రైబల్ యూనివర్సిటీ కోసం ప్రజా సంఘాలు, ఇతర సంస్థలతో కలిసి పోరాటాలు చేస్తామన్నారు. బీజేపీ తెలంగాణలో తలపెట్టిన కుట్రను సీఎం కేసీఆర్ ఛేదించారని తెలిపారు. దేశ ప్రజలు కేసీఆర్ నిర్ణయాలను ఆసక్తిగా గమనిస్తున్నారని, కేంద్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. అంతకుముందు డివిజన్ల వారీగా సమస్యలను, కాలనీల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
బీసీనని చెప్పుకోవడమే కానీ.. బీసీ గణన చేయని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ బీసీ అని చెప్పుకోవడమే కానీ బీసీల జనగణన చేయలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తోందని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఉచిత చేపపిల్లలను ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా సోమవారం హనుమకొండ మచిలీబజార్ మత్స్య సహకార ఆధ్వర్యంలో చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ భద్రకాళి చెరువులో వదిలారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎకడాలేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లల పంపిణీతో రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందన్నారు.
భద్రకాళి చెరువులో రూ.6లక్షలతో దాదాపు 4లక్షల చేపపిల్లలు వేసినందున మత్స్యకారులకు దాదాపు రూ.2కోట్ల సమకూరుతుందని చెప్పారు. ఉమ్మడి జిల్లా మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు బుస్సా మల్లేశం మాట్లాడుతూ తాగునీటి చెరువుల్లో చేపలు పెంచుకునే అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారని తెలిపారు. కార్పొరేటర్లు తోట వెంకన్న, దాస్యం అభినవ్భాసర్, దేవరకొండ విజయలక్ష్మీ సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, టీఆర్ఎస్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి విజయభారతి, మత్స్య సొసైటీ బాధ్యులు సారంగపాణి, బయ్య శోభన్ పాల్గొన్నారు.