హసన్పర్తి, నవంబర్ 18 : వరంగల్లోని ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఈబస్ విధానం ద్వారా మొదటి సారిగా 60 ఏండ్ల వృద్ధుడికి లంగ్ క్యాన్సర్ను స్పాట్లోనే నిర్ధారించి ఉచితంగా చికిత్స చేసినట్లు డాక్టర్ ఎర్రబెల్లి హర్షిణి తెలిపారు. ఇటలీ దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరెన్స్ నుంచి ఇంటర్ వెన్షనల్ పల్మనాజీలో శిక్షణ పొంది స్పాట్లోనే నిర్ధారించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను పుట్టి పెరిగిన వరంగల్లో మొదటిసారిగా ఈబస్ ప్రొసీజర్ చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభ్వుత్వం క్యాన్సర్ను ఆరోగ్యశ్రీలో చేర్చడం అభినందనీయమని, పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పారు. ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి ప్రతీక్ మాట్లాడుతూ వరంగల్, ఉత్తర తెలంగాణ ప్రజలు ఇటువంటి అత్యాధునిక వ్యాధి నిర్ధారణ, చికిత్స కోసం హైదరాబాద్కు వెళ్లనవసరం లేదని, ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అందిస్తున్నామని పేర్కొన్నారు. డాక్టర్ హర్షిణి బుధ, శని వారాలలో ఓపీ చూస్తారని చెప్పారు. డాక్టర్ బోయినపల్లి ప్రతీక్, ఆంకో సర్జన్ డాక్టర్ తిప్పని అవినాశ్, హేమిటో ఆంకాలజిస్ట్ డాక్టర్ రాహుల్ తదితరులు ఎర్రబెల్లి హర్షిణిని అభినందించారు.