దుగ్గొండి, నవంబర్ 16: దాతల సహకారం ఓ బాధితుడి జీవితాన్ని నిలబెట్టింది. ఇంటి యజమాని ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి పడి గాయాలపాలై నిస్సహాయస్థితిలో ఉండగా, ఆ కుటుంబానికి మేమున్నామంటూ స్వచ్ఛంద ప్రతినిధులు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన గీత కార్మికుడు బొమ్మగాని పూర్ణచందర్గౌడ్ వృత్తిలో భాగంగా ఇటీవల తాటిచెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు మోకు జారి కిందపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడి వెన్నుపూస దెబ్బతినడంతో లేవలేని స్థితిలో ఉన్నాడు. అతడికి భార్య, కూతురు (6వ తరగతి), కుమారుడు (8వ తరగతి) ఉన్నారు. పూర్ణచందర్గౌడ్కు కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ప్రవాస భారతీయుల స్వచ్ఛంద సేవా సంస్థ అయిన హోప్ ఫర్ స్పందన సౌజన్యంతో సంస్థ ఉపాధ్యక్షుడు లక్ష్మీనర్సింహం కోట, సభ్యులు డాక్టర్ శైలేంద్ర కర్రి రూ. 1.20 లక్షలతో గ్రామంలో అతడికి కిరాణా షాపు ఏర్పాటు చేశారు. అలాగే, బాధితుడి పిల్లల చదువు కోసం ఏటా రూ. 10 వేలతోపాటు నెలకు రూ. 2 వేల మెడికల్ కిట్ అందజేస్తామని తెలిపారు. ఈ మేరకు బుధవారం స్వచ్ఛంద సంస్థ బాధ్యులు షాపును ప్రారంభించారు. తమకు జీవనోపాధి కల్పించడమే కాకుండా మనోధైర్యం కల్పించినందుకు పూర్ణచందర్గౌడ్ కుటుంబ సభ్యులు హోప్ ఫర్ స్పందన సంస్థకు కృతజ్ఞలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సమన్వయకర్త బిడియల్ విన్నర్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు రఘు అరికపూడి, తెలంగాణ ప్లోరోసిస్ విముక్తి పోరాట సమితి కన్వీనర్ కంచుకట్ల సుభాష్, హృదయాలయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ గణేశ్బాబు, మానవతావాది భీమాశంకర్, రాజు, మహేశ్, లక్ష్య మూవీస్ ఉదయ్, సతీశ్, లింగయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.