సుబేదారి, నవంబర్ 1: నేరస్తులకు కోర్టులో శిక్ష పడితే పోలీసులకు ప్రజలు మరింత దగ్గరవుతారని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్కు చెందిన సెంట్రల్ జోన్ పరిధిలో వివిధ నేరాలకు పాల్పడిన వారికి శిక్ష పడడంలో కీలకంగా వ్యవహరించిన ప్రభుత్వ న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లను వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం ఘనంగా సన్మానించారు.
ఈ ఏడాది సెంట్రల్ జోన్ పరిధిలో జరిగిన వివిధ రకాల నేరాలకు పాల్పడిన నిందితుల్లో ముగ్గురికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష, మరో నిందితుడికి ఎనిమిదేళ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. వీరికి శిక్ష పడడంలో ప్రతిభ కనబర్చిన వరంగల్ ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ కే అజయ్కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసరావు, ట్రాన్స్కో విజిలెన్స్ అధికారి ఎస్ జనార్దన్, టాస్క్ఫోర్స్ ఏసీపీ ఎం జితేందర్రెడ్డి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ జనార్దన్రెడ్డి, కోర్టు కానిస్టేబుళ్లు వీ రాజు, ఎం వీరస్వామి, ఏ సుధాకర్, జీ జ్ఞానేశ్వర్ను సీపీ ప్రశంసాపత్రాలు అందించి సన్మానించారు.
ఈ సందర్భంగా తరుణ్జోషి మాట్లాడుతూ నేరాన్ని నిరూపించేందుకు అధికారులు నైపుణ్యంతో కూడిన దర్యాప్తు నిర్వహించాలని, కోర్టులో నేరస్తుడికి శిక్ష పడినప్పుడే ప్రజలకు పోలీసులపై నమ్మకం, గౌరవం పెరుగుతాయని గుర్తుచేశారు. అదేవిధంగా కోర్టు కేసులపై పోలీస్ అధికారులు తరచూ సమీక్షించాలని, కోర్టుమానిటరింగ్ సిస్టమ్ ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సమన్వయం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్కుమార్, లా అండ్ ఆర్డర్ అదనపు డీసీపీ పుష్పారెడ్డి, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్లు కరుణాకర్, రమేశ్ పాల్గొన్నారు.