యాసంగి పంటల సాగు కోసం జిల్లా అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. గతేడాది 1,72,399 ఎకరాలు కాగా.. ఈసారి 1,93,769 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలను సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. వరి తర్వాత స్థానంలో మక్కజొన్న సాగుకు రైతులు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి పంపించారు. 35,667 క్వింటాళ్ల విత్తనాలు, 98 టన్నుల ఎరువులు అవసరమవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం యూరియా 7,680, డీఏపీ 810, ఎంవోపీ 320, కాంప్లెక్స్ 5,400, ఎస్ఎస్పీ 200 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. క్లస్టర్ స్థాయిలో రైతువేదికల ద్వారా రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.
వరంగల్, అక్టోబర్ 28(నమస్తేతెలంగాణ) : ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో జిల్లాలో యాసంగి పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగనుంది. 1,93,769 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు పంటల సాగు కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించారు. గత ఏడాది యాసంగి కంటే ఈ ఏడాది అదనంగా 21,370 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేసే అవకాశం ఉంది.
గత ఏడాది 1,72,399 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు. ప్రధానంగా రైతులు ఈ సారి ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేయవచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వరి తర్వాత స్థానంలో మక్కజొన్న పంట విస్తీర్ణం ఉండనుంది. యాసంగి సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కొద్దిరోజుల నుంచి వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంటల సాగుపై అంచనా వేశారు. ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. పంట వారీగా వరి 1,01,077, జొన్న 482, మక్కజొన్న 81,667, పెసర 765, అలసంద 509, మినుము 249, శెనగ 720, మిర్చి 1,192, కూరగాయలు 3,567, పత్తి 106, వేరుశనగ 2,790, నువ్వు 357, పొద్దుతిరుగుడు 288 ఎకరాల్లో రైతులు సాగు చేసే అవకాశం ఉందని నివేదికలో తెలిపారు. వ్యవసాయశాఖ అధికారుల అంచనా మేరకు ఈ యాసంగి వరి పంట సాగు విస్తీర్ణం పెరుగనుందని తెలుస్తున్నది.
గత ఏడాది 76,960 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఈ ఏడాది అదనంగా 24,117 ఎకరాలు పెరుగనుంది. వేరుశనగ, శనగ, పత్తి, నువ్వు పంటల విస్తీర్ణం కూడా కొంత పెరుగనుంది. గత యాసంగిలో వేరుశెనగ 1,944, శెనగ 486, పత్తి 82, నువ్వు 338 ఎకరాల్లో సాగు చేశారు. యాసంగిలో రైతులు పత్తి పంట సాగు చేయడం జిల్లాలో గత యాసంగి నుంచే ప్రారంభమైంది. మక్కజొన్న, జొన్న, పెసర, అలసంద, మినుము, శెనగ, మిర్చి, కూరగాయలు, పొద్దుతిరుగుడు పంటల సాగు విస్తీర్ణం ఈ యాసంగిలో తగ్గనుందని అధికారులు అంచనా వేశారు. గత యాసంగిలో మక్కజొన్న 84,243, జొన్న 514, పెసర 1,144, అలసంద 622, మినుము 250, మిర్చి 1,859, కూరగాయలు 3,638, పొద్దుతిరుగుడు 319 ఎకరాల్లో సాగు చేశారు. ఈ యాసంగిలో ఈ పంటల సాగు విస్తీర్ణం తగ్గనుండగా, వరి సాగు విస్తీర్ణం పెరుగనుందని భావిస్తున్నారు.
యాసంగిలో వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం కూడా వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. 35,667 క్వింటాళ్ల విత్తనాలు అవసరమ ని, ఇందులో 25,270 క్వింటాళ్లు వరి విత్తనాలే కావాలని నివేదికలో పేర్కొన్నారు. జొన్న 100, మక్కజొన్న 6,540, పెసర 65, అలసంద 52, మినుము 20, శెనగ 216, మిర్చి 2, కూరగాయలు 36, వేరుశనగ 3,348, నువ్వు 8, పొద్దుతిరుగుడు 10 క్వింటాళ్లు, 250 ప్యాకె ట్ల పత్తి విత్తనాలు కావాలని తెలిపారు. యూరియా 40, డీఏపీ 17, ఎంవోపీ 15, కాంప్లెక్స్ 22, ఎస్ఎస్పీ 4 వేల టన్నులు అవసరమని నివేదికలో వివరించారు.
వీటిలో ప్రస్తుతం యూరియా 7,680, డీఏ పీ 810, ఎంవోపీ 320, కాంప్లెక్స్ 5,400, ఎస్ఎస్పీ 200 టన్నులు అందుబాటులో ఉందని తెలిపారు. యాసంగి పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో వ్యవసాయశాఖ అధికారులు క్లస్టర్ స్థాయిలో రైతువేదికల ద్వారా యాసంగి పంటల సాగుపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు.