జిల్లాలో సోమవారం నుంచి పోడు భూములను సర్వే చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఈనెల 30 వరకు పూర్తిచేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం కలెక్టర్ బీ గోపి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని నియమించారు. సర్వే అనంతరం ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్లో నివేదికను అప్లోడ్ చేస్తారు. నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లోని 64 హ్యాబిటేషన్ల నుంచి పోడు భూములకు సంబంధించి 7,711 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. 2005 డిసెంబర్ 13వ తేదీ కంటే ముందు అటవీ భూములను పోడు చేసి సాగు చేసుకుంటున్న రైతులకు ప్రభుత్వం హక్కులు కల్పించనుంది. ఈ మేరకు నిబంధనల ప్రకారం అర్హత ఉన్న పోడు రైతుల నుంచి గత డిసెంబర్లో అధికారులు
దరఖాస్తులు స్వీకరించారు.
వరంగల్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): జిల్లాలో పోడు భూములపై సర్వేకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. సోమవారం నుంచి హ్యాబిటేషన్ల వారీగా సర్వే చేసేందుకు నిర్ణయించారు. ఈ నెల 30లోగా సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2005 డిసెంబర్ 13 కం టే ముందు అటవీ భూములను పోడు చేసి సాగు చేసుకుంటున్న రైతులకు హక్కులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు ఉన్న పోడు రైతుల నుంచి గత డిసెంబర్లో అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో భాగంగా ప్రతి హ్యాబిటేషన్లో పోడు రైతులతో సమావేశాలు నిర్వహించారు. అడవుల రక్షణ కోసం 17 మందితో ఎఫ్ఆర్సీ కమిటీలనూ ఏర్పాటు చేశారు.
అనంతరం హ్యాబిటేషన్ వారీగా పోడు రైతుల నుంచి దరఖాస్తులను తీసుకున్నారు. ఇలా జిల్లాలో నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లోని 64 హ్యాబిటేషన్ల నుంచి 7,711 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ దరఖాస్తుల ఆధారంగా హ్యాబిటేషన్ల వారీగా సర్వే నిర్వహించి నివేదిక పంపాలని కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా కలెక్టర్ బీ గోపి సర్వే నిర్వహించడంపై గత సెప్టెంబర్ 22న వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఎఫ్ఆర్సీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. పోడు భూముల సర్వే నిర్వహణపై ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తెలియజేశారు. ఆ తర్వాత అధికారులు పోడు భూముల సర్వే జరిగే ఐదు మండలాల్లోని హ్యాబిటేషన్లలో మోడల్ సర్వే జరిపారు.
ఈ సందర్భంగా తమ దృష్టికి వచ్చిన అంశాలను జిల్లా కలెక్టర్కు నివేదించారు. ఆయన ఆదేశాలతో జిల్లాలో పోడు భూములపై సర్వే నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ బీ గోపి జిల్లాస్థాయి అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. మండలం వారీగా నల్లబెల్లికి జడ్పీ సీఈవో సాహితి, నర్సంపేటకు సీపీవో జీవరత్నం, ఖానాపురం డీఆర్డీవో ఎం సంపత్రావు, చెన్నారావుపేటకు భూగర్భ జల శాఖ జిల్లా అధికారి అశోక్, నెక్కొండకు మత్స్యశాఖ జిల్లా అధికారి నరేశ్కుమార్ నాయుడు ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు.
పోడు భూములపై సర్వే మొదలుపెట్టేందుకు కలెక్టర్ బీ గోపి గత శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీవోతో పాటు జిల్లా అటవీ అధికారి, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోతో పాటు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, స్పెషల్ ఆఫీసర్లు, మండల, హ్యాబిటేషన్ టీంల అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీ లోపు పోడు భూములపై సర్వే పూర్తి చేసేవిధంగా షెడ్యూల్ నిర్ణయించారు. హ్యాబిటేషన్ స్థాయిలో ఎఫ్ఆర్సీ గ్రామ స్థాయి కమిటీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్వే నిర్వహించాలని, మండల స్థాయి కమిటీలు పర్యవేక్షించాలని చెప్పారు.
ఎఫ్ఆర్సీ గ్రామ స్థాయి కమిటీలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఫారెస్టు బీటు అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేదా సర్వేయర్, మండల స్థాయి కమిటీలో స్థానిక తాసిల్దార్, ఎంపీడీవో, ఫారెస్ట్ రేంజ్ అధికారి సభ్యులుగా ఉంటారు. నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లోని 35 గ్రామ పంచాయతీల పరిధిలో గల 64 హ్యాబిటేషన్లలో ఈ ఎఫ్ఆర్సీ గ్రామ స్థాయి కమిటీలు తమకు అందిన దరఖాస్తుల ప్రకారం పోడు భూములపై క్షేత్రస్థాయిలో సర్వే జరపాల్సి ఉంది. సర్వే అనంతరం ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్లో కమిటీలోని సభ్యులు నివేదికను అప్లోడ్ చేస్తారు. స్పెషల్ ఆఫీసర్లు, ఎఫ్ఆర్సీ మండల స్థాయి కమిటీల పర్యవేక్షణలో ఈ సర్వే జరుగనుంది.
రెండు రోజుల క్రితం సర్వేలో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం కూడా జరిగింది. ఏ రోజు ఏ హ్యాబిటేషన్ పరిధిలో పోడు భూములపై సర్వే జరగాలనేది షెడ్యూల్లో పేర్కొనడంతో సోమవారం నుంచి సర్వే ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 30వ తేదీ వరకు సర్వే పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఎఫ్ఆర్సీ జిల్లా నోడల్ అధికారిగా ఏటూరునాగారం ఐటీడీఏ పీవో, చైర్మన్గా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. డీటీడబ్ల్యూవో జహీరొద్దీన్ ఈ సర్వే సమన్వయకర్త బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పోడు భూముల సర్వేపై కలెక్టర్ గోపి ఏటూరునాగారం ఐటీడీఏ పీవోతోనూ చర్చించినట్లు తెలిసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10వ తేదీ నుంచి జిల్లాలో పోడు భూములపై సర్వే ప్రారంభం కానుందని సమన్వయకర్త జహీరొద్దీన్ వెల్లడించారు.