విజయ దశమి సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించిన ‘భారత రాష్ట్ర సమితి’ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ జిల్లా అంతటా సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు, ర్యాలీలతో ఊరూవాడా హోరెత్తాయి. పండుగ పూట కేసీఆర్ జాతీయ పార్టీని పెడుతున్నామని ప్రకటించగానే అప్పటిదాకా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న బీ(టీ)ఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి డ్యాన్స్ చేస్తూ ‘అలయ్ బలయ్’ తీసుకున్నారు. పటాకులు పేల్చి, కేక్లు కట్ చేసి, స్వీట్లు పంచుకొని నిజమైన ‘దసరా’ను జరుపుకొన్నారు. ప్రజలు, అభిమానులు, పార్టీ నేతలు ‘దేశ్ కీ నేత కేసీఆర్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కేసీఆర్ పెట్టిన జాతీయ పార్టీ విజయం సాధించాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, దర్గాల్లో ప్రార్థనలు చేశారు.
– వరంగల్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ)
అభివృద్ధి, పురోగతియే ధ్యేయంగా దేశరాజకీయాల్లో మార్పు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి నవశకం ప్రారంభించింది. జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మార్పు చెందింది. ఈ చారిత్రక ఘటనకు విజయ దశమి నాడు తెలంగాణ భవన్ వేదికైంది. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయా జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులు హాజరయ్యారు. జాతీయ పార్టీగా మార్చుతూ సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సంబురాలు జరిగాయి. ఇందుకు సంబంధించిన దృశ్యమాలిక మీకోసం.