జాతీయస్థాయిలో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడంతో జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కేసీఆర్తోనే దేశం అభివృద్ధి చెందుతుందని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్, సాగు నీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి వ్యవసాయ రంగాన్ని ఊహించని రీతిలో అభివృద్ధి చేసి అన్న పూర్ణగా మలిచారని కొనియాడారు. కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించడాన్ని పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
అన్ని రాష్ర్టాలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని, ఈ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం పోరాటం అనంతరం ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నదన్నారు. రాష్ట్రాన్ని సాధించి చరిత్ర సృష్టించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలను శాసించే విధంగా ఎదిగిన మహోన్నత శక్తి అని తెలిపారు. ఆయన ఒక వ్యక్తి మాత్రమే కాదు… ఒక వ్యవస్థ అని, ఉద్యమ నాయకుడు కేసీఆర్ సారధ్యంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం చెందడం దేశానికి శుభప్రదమన్నారు. బీఆర్ఎస్ను ప్రకటించిన కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు.
– వరంగల్, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ)