దుగ్గొండి/చెన్నారావుపేట/ఖానాపురం/సంగెం, అక్టోబర్ 5: విజయదశమి వేడుకలను బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు జమ్మిచెట్టుకు శమీపూజ నిర్వహించారు. అనంతరం పాలపిట్టను దర్శించుకున్నారు. అలాగే, పోలీస్స్టేషన్లలో సిబ్బంది ఆయుధపూజ నిర్వహించారు. ఇందులో దుగ్గొండితోపాటు అన్ని గ్రామాల్లో ప్రజలు దసరా వేడుకలను ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఉత్సాహంగా జరుపుకున్నారు. గ్రామస్తుల సంప్రదాయాల ప్రకారం ముందుగా బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులంతా కలిసి ఊరి చివరన ఉన్న జమ్మిచెట్టు వద్దకు వెళ్లి శమీపూజ చేసి జమ్మి ఆకులను ఇండ్లకు తీసుకొచ్చారు.
సాయంత్రం గ్రామ కూడళ్లలో రావణవధ కార్యక్రమాన్ని నిర్వహించారు. దుగ్గొండి రూరల్ సీఐ సూర్యప్రసాద్, ఎస్సై నవీన్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, వైస్ ఎంపీపీ పల్లాటి జైపాల్రెడ్డి, ఎన్నారై రాజ్కుమార్ శానబోయిన, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజేశ్వర్రావు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. చెన్నారావుపేటలోని పోలీస్సేషన్లో ఎస్సై తోట మహేందర్ ఆధ్వర్యంలో ఆయుధపూజ నిర్వహించారు. స్టేషన్ ఆవరణలో జమ్మి చెట్టు, ఆయుధాలు, పోలీసు వాహనాలకు పూజలు చేశారు. అలాగే, చెన్నారావుపేటలో ముదిరాజ్లు ఆయుధపూజ నిర్వహించారు.
సర్పంచ్ కుండె మల్లయ్య ఆధ్వర్యంలో జమ్మి చెట్టుకు పూజలు చేశారు. ఖానాపురంలో శ్రీరామ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రావణాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, సర్పంచ్ చిరంజీవి రావణాసురుడి ప్రతిమకు నిప్పంటించారు. ఎస్సై తిరుపతి గట్టి బందోబస్తు చేపట్టారు. వేడుకల్లో ఎంపీటీసీలు మర్రి కవిత, బోడ భారతి, తరాల శ్రీను, నీలం సాంబయ్య, చెన్నూరి సత్యం, యాలాద్రి, పూర్ణచందర్, నరేశ్, కిరణ్, కార్తీక్, రాజు పాల్గొన్నారు. ఎస్సై పెండ్యాల దేవేందర్ ఆధ్వర్యంలో సంగెం పోలీస్స్టేషన్లో ఆయుధపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన పూజారి అప్పె నాగార్జునశర్మ వేదమంత్రోచ్ఛారణల మధ్య కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి చిత్రపటం ఎదుట ఆయుధాలతోపాటు పండ్లు, స్వీట్లు పెట్టి ఏడాదంతా మంచి జరుగాలని పూజలు చేశారు. కార్యక్రమంలో హెడ్కానిస్టేబుల్ శ్రీనాథ్, సిబ్బంది పాల్గొన్నారు.
నర్సంపేటరూరల్/నల్లబెల్లి: విజయదశమి వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించారు. నర్సంపేట మండలంలోని 27 గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దసరా వేడుకలను నిర్దేశించిన ప్రదేశాల్లో జమ్మిచెట్లు ఏర్పాటు చేసి వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు. నర్సంపేట మండలం చంద్రయ్యపల్లిలో సర్పంచ్ బరిగెల లావణ్య, ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్రెడ్డి, ముత్తోజిపేట బీసీ కాలనీలో సర్పంచ్ గోలి శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ గంగాడి సాంబరెడ్డి, లక్నేపల్లిలో సర్పంచ్ గొడిశాల రాంబాబు, ఎంపీటీసీ ఉల్లేరావు రజిత, రామవరంలో సర్పంచ్ కొడారి రవన్న, గురిజాలలో సర్పంచ్ గొడిశాల మమత-సదానందం, ఎంపీటీసీ బండారి శ్రీలత-రమేశ్, భోజ్యానాయక్తండా, దాసరిపల్లి, కమ్మపల్లి, ఇటుకాలపల్లి, రాజుపేట, రాజపల్లి, మహేశ్వరంలో ప్రజాప్రతినిధులు, కుల పెద్దల ఆధ్వర్యంలో జమ్మి పూజలు కొనసాగాయి.
మాదన్నపేటలో జీపీ ఆధ్వర్యంలో చేసిన రావణవధ ఏర్పాట్లను సర్పంచ్ మొలుగూరి చంద్రమౌళి, వార్డు సభ్యులు పరిశీలించారు. మహేశ్వరంలో జమ్మిపూజలో నాయకులు మోతె పద్మనాభరెడ్డి, బండారి రమేష్, చేరాల గోవర్ధన్, మాడ్గుల నిరంజన్రెడ్డి, మల్లయ్య పాల్గొన్నారు. నల్లబెల్లి మండలంలో రావణవధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నల్లబెల్లి మండలకేంద్రంలోని ఎస్సారెస్పీ కెనాల్ పక్కన సర్పంచ్ నానెబోయిన రాజారాం ఆధ్వర్యంలో రావణవధ నిర్వహించారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కొత్తపెల్లి కోటిలింగాచారి, గుమ్మడి వేణు, ఉప సర్పంచ్ నాగేశ్వర్రావు, పోతునూరి సుభాష్, పరికి నవీన్, లింగయ్య పాల్గొన్నారు. అలాగే, నల్లబెల్లిలో జరిగిన రావణవధ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, స్వప్న దంపతులు, ఏసీపీ సంపత్రావు, సీఐ సూర్యప్రసాద్ హాజరయ్యారు.
రాయపర్తి/సంగెం/గీసుగొండ/నర్సంపేట: విజయదశమి పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వృత్తుల నిర్వహణలో వినియోగించే వస్తు సామగ్రి, ఆయుధాలకు తమ ఇండ్లు, షాపుల్లో పూజలు చేశారు. మధ్యాహ్నం వేళ బొడ్రాయి, ప్రధాన కూడళ్లు, కోట బురుజుల వద్ద వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ దసరా ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం బంగారంగా భావించే జమ్మి ఆకు, పాలపిట్టల దర్శనాల కోసం ప్రజలు గ్రామ పొలిమేరల్లోకి బారులు తీరారు. రాయపర్తి మండలంలో ఎస్సై బండారి రాజు నేతృత్వంలో బందోబస్తు నిర్వహించారు.
సంగెం మండలంలోని మొండ్రాయి, గవిచర్లలోతోపాటు రావణవధ ప్రతిమలు ఏర్పాటు చేసి పటాకులతో కాల్చారు. సర్పంచ్లు విజయదశమి ఏర్పాట్లను ఘనంగా చేశారు. డబ్పుచప్పుళ్ల మధ్య ప్రజలు ర్యాలీగా ఊరు శివారుల్లోకి తరలివెళ్లారు. జమ్మిచెట్టుకు పూజలు చేసిన అనంతరం జమ్మి ఆకుకోసం పోటీపడ్డారు. సంగెం ఎస్సై పెండ్యాల దేవేందర్ ఆధ్వర్యంలో పోలీసులు పెట్రోలింగ్ చేశారు. బంధుమిత్రుల రాకతో గ్రామాల్లో సందడి నెలకొంది. విజయ దశమి సందర్భంగా గీసుగొండ మండల ప్రజలు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు.
నర్సంపేటలోని వేంకటేశ్వరాలయంలో శమీపూజ నిర్వహించారు. తర్వాత బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సోరకాయ, యాటను కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం జమ్మి చెట్టుకు పూజలు చేశారు. తర్వాత రవణవధ కనులపండువగా సాగింది. మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నర్సంపేట సీఐ పులి రమేశ్, రూరల్ సీఐ సూర్యప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.
కరీమాబాద్/గిర్మాజీపేట/పోచమ్మమైదాన్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని మామునూరులోని 4వ బెటాలియన్లో ఆయుధపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా బెటాలియన్లోని వాహనాలతోపాటు పలు రకాల ఆయుధాలకు కమాండెంట్ శివప్రసాద్రెడ్డి పూజలు నిర్వహించారు. ఏటా దసరా రోజు బెటాలియన్లో ఆయుధపూజ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నరేందర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్ సీఐ డీ మల్లేశ్ శాస్ర్తోక్తంగా ఆయుధపూజ నిర్వహించారు. ఎస్సై శివ, కానిస్టేబుళ్లు వినయ్, రబ్బాని, రాజశేఖర్, తాళ్ల శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ దేశాయిపేటలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా(బాబా మహా సమాధి) సందర్భంగా ఆలయంలో ఉదయం 6 గంటలకు అభిషేకం, విశేష పూజలు చేశారు.
సాయంత్రం సాయిబాబాకు ప్రత్యేక పుష్పాలంకరణ, శమీపూజ, సహస్ర దీపాలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. వరంగల్ 12వ డివిజన్ దేశాయిపేటలోని బొడ్రాయి వద్ద స్థానికులు దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బొడ్రాయి వద్ద విశేష పూజలతోపాటు శమీపూజ నిర్వహించారు. అనంతరం జమ్మి ఆకులను ఒకరినొకరు ఇచ్చుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. అలాగే, డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీనగర్లో కాలనీవాసులు దసరా వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సెకండ్ డాక్టర్స్కాలనీ పూజారి శ్రీనివాసమూర్తి జమ్మిచెట్టుకు శమీపూజ చేశారు. కమిటీ సభ్యులు రవీందర్, శశికుమార్, రామస్వామి, వేణుగోపాలచారి, మూర్తి, శేఖర్, సంజీవ్ పాల్గొన్నారు.