వరంగల్, అక్టోబర్ 4 : కళలకు కాణాచి అయిన చారిత్రక ఓరుగల్లులో శిల్ప కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని, వరంగల్ ప్రజల కొంగు బంగారమైన భద్రకాళి దేవాలయం చుట్టూ మాడ వీధుల నిర్మాణానికి రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసి సీఎం కేసీఆర్కు శిరస్సు వంచి పాదాభివందన మని ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మంగళవారం భద్రకాళి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
భద్రకాళి అమ్మవారి సన్నిధిలో మాడ వీధుల నిర్మాణం అనే పవిత్ర కార్యానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. రెండు దశాబ్దాల కల సాకారమైందని ఆయన చెప్పారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా 20 కోట్లు, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా రూ.10 కోట్లు కేటాయించి మాడవీధుల నిర్మాణం చేపడుతామని వివరించారు. మాడ వీధుల నిర్మాణంలో భద్రకాళి దేవాలయ రూపురేఖలు మారుతాయని, ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన తెలిపారు.
భద్రకాళి ఆలయ అభివృద్ధికి నయాపైసా నిధులు ఇవ్వని వారు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విజయదశమి రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో గుణాత్మకమైన మార్పు కోసం సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని విరించారు. దేశంలోని అనేక పార్టీల నేతలు, పలు వర్గాల ప్రజల మేరకు కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసే జాతీయ పార్టీ దేశమంతా విస్తరిస్తుందని ఆయన చెప్పారు.
దేశంలో అసమర్థ పార్టీ పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ భద్రకాళి దేవాలయం చుట్టూ మాడ వీధుల నిర్మాణం కోసం చీఫ్ విఫ్ దాస్యం వినయ్భాస్కర్ ఎంతో పరితపించారని, నిధుల మంజూరుకు ఎంతో కృషి చేశారని రు. భద్రకాళి మాడవీధుల నిర్మాణంతో చారిత్రక వరంగల్ నగరం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ భద్రకాళి దేవాలయం స్ఫూర్తితోనే జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణం చేపట్టారన్నారు. మాడ వీధుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, ఆలయ ఈవో శేషుభారతి, ఆలయ ప్రధాన అర్చకుడు శేషు పాల్గొన్నారు.