కరీమాబాద్, అక్టోబర్ 4: విజయదశమి సందర్భంగా ఉర్సు రంగలీలామైదానంలో బుధవారం సాయంత్రం రావణవధ నిర్వహించనున్నారు. ఇందుకోసం 75 అడుగుల రావణ ప్రతిమను ఏర్పాటు చేశారు. వేలాది మంది వీక్షించే ఈ వేడుకకు ఉత్సవ సమితి, పలు శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, నాయకులు పాల్గొననున్నారు. ఆహ్లాదాన్ని పంచేందుకు కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
కరీమాబాద్లోని రామస్వామి ఆలయం నుంచి సీతారామాంజనేయ లక్ష్మణులు రథంపై తరలి రానున్నారు. వేలాది మంది ఒక్కచోట చేరుతున్న వేళ భారీ బందోబస్తు చేపట్టాల్సిన పోలీసుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది దసరా వేదికపై ప్రజాప్రతినిధులు సైతం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది జనం హాజరయ్యే వేడుకలో చేపట్టిన బందోబస్తు ఇలాగే ఉంటుందా ? అని ప్రశ్నించారు. వేదికపైకి పదుల సంఖ్యలో ప్రజలు రావడంతో వారు ఇబ్బంది పడ్డారు. అంతేకాకుండా రెండు రోజుల క్రితం ముగిసిన సద్దుల బతుకమ్మ వేడుకల్లోనూ పోలీసుల పనితీరుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆట స్థలాల్లోకి యువకులు భారీగా రావడంతో ఇబ్బంది పడినట్లు తెలిసింది.
రెట్టింపు సిబ్బందితో బందోబస్తు
గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది గతంలో కన్నా రెట్టిం పు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తాం. ప్రజలు పోలీసులకు సహకరించాలి. వాహనాల్లో వచ్చేవారు పోలీసుల సూచనలు పాటించాలి. పార్కింగ్ స్థలాలను కేటాయిం చాం. రంగశాయిపేట నుంచి వచ్చే వాహనా లు తాళ్ల పద్మావతి కళాశాల ఎదుటు, హన్మకొండ నుంచి వచ్చే వాహనాలు జేఎస్ఎం పాఠశాలలో, కరీమాబాద్ నుంచి వచ్చే వాహనాలు కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బీరన్నగుడిలో, భట్టుపల్లి నుంచి వచ్చే వాహనాలు గుట్ట వెనకాల పార్కింగ్ చేయాలి. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలి.
– శ్రీనివాస్, మిల్స్కాలనీ సీఐ