వర్ధన్నపేట, అక్టోబర్ 4 : ఆరోగ్యవంతమైన తెలంగాణ సమాజం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ల్యాబర్తి గ్రామానికి చెందిన సంకినేని సంజీవ కూతురు దీక్షిత, కుమారుడు చరణ్ అంగవైకల్యంతో జన్మించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
వీరి పరిస్థితిని గ్రామ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే అరూరి చిన్నారుల వైద్య పరీక్షల కోసం రూ. 5 లక్షల ఎల్వోసీని మంజూరు చేయించి మంగళవారం ల్యాబర్తి గ్రామంలోని సంజీవ ఇంటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు జబ్బులు చేస్తే వైద్యం కోసం కేసీఆర్ పెద్ద మనస్సుతో ఎల్వోసీలు, సీఎంఆర్ఎఫ్ నిధులను పెద్ద మొత్తంలో మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ సహకారంతో చాలా మంది పేదలకు సీఎంఆర్ఎఫ్ నిధులు, ఎల్వోసీలు అందజేస్తున్నట్లు తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య పరీక్షలు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రుల నిర్మాణం చేయించడం జరుగుతుందని అన్నారు.
అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలను కూడా మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. వరంగల్లో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రంలోనే తలమానికంగా నిలవనున్నదన్నారు. అలాగే మండలంలోని ఇల్లంద గ్రామానికి చెందిన పల్లె రాజుకు రూ.2లక్షల 50వేల ఎల్వోసీని అతడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, సర్పంచ్ పస్తం రాజు, ఎంపీటీసీ అన్నమనేని ఉమాదేవి, ఉప సర్పంచ్ పిన్నింటి కళింగరావు, ఇల్లంద సర్పంచ్ సాంబయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.