మడికొండ, అక్టోబర్ 3: తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికులకు అండగా నిలిచి చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మడికొండలోని కాకతీయ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెక్స్టైల్ పార్కును సోమవారం ఆయన టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డితో కలిసి సందర్శించారు. పలు యూనిట్లలో తయారవుతున్న వస్ర్తాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వలసల నివారణతోపాటు ఉమ్మడి జిల్లాకు ఉజ్వల భవిష్యత్ తెచ్చేలా, దేశానికే తలమానికంలా నిలిచేవిధంగా మడికొండలో టెక్స్టైల్ పార్కు రూపుదిద్దుకుంటున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ టెక్స్టైల్ పరిశ్రమల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. 60 ఎకరాల్లో 364 పవర్లూమ్ యూనిట్లను ప్రారంభించిందన్నారు. ప్రత్యక్షంగా 5వేల మందికి ఉపాధి కల్పిస్తుండగా, 4వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. చేనేత కార్మికులు సొంత పవర్లూమ్స్తో పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు తెలంగాణ సర్కారు సహాయపడిందని గుర్తు చేశారు. దీంతో వలసలు వెళ్లిన చేనేత కార్మికులు ఇప్పుడు సొంత ఊళ్లోనే పని చేసుకుంటున్నారని తెలిపారు. టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. పార్కులో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, కాంపౌండ్ నిర్మాణ పనులు చేపట్టడంతోపాటు ప్రతి యూనిట్కు తాగునీరు అందిస్తామని చెప్పారు. అతి త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా టెక్స్టైల్ పార్కును ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ సంతోష్కుమార్, సొసైటీ అధ్యక్షుడు దర్గాస్వామి, వైస్ ప్రెసిడెంట్ కూరపాటి అయిలయ్య, 46వ డివిజన్ కార్పొరేటర్ మునిగాల సరోజన, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు బొల్లికొండ వినోద్ కుమార్, నాయకులు దువ్వ శ్రీకాంత్, వల్లెపు ఉపేందర్, నర్మెట భిక్షపతి, దువ్వ నవీన్, అల్లం శ్రీనివాసరావు, మునిగాల కరుణాకర్, కొలిపాక కుమార్బాబు, పల్లపు కుమార్రాజ్, వస్కుల దేవేందర్, రాసమల్ల వెంకటస్వామి, రమేశ్, శ్రీధర్ పాల్గొన్నారు.