ములుగు రూరల్, అక్టోబర్ 1: ఒకే దేశం.. ఒకే విధానం అంటూ ప్రగల్భాలు పలుకుతూ.. గిరిజన రిజర్వేషన్ల పెంపుపై ఆరేళ్లుగా నాన్చుతున్న కేంద్రంలోని బీజేపీ.. గిరిజన ద్రోహిగా మారిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు పెంచడాన్ని హర్షిస్తూ మంత్రి జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్తో కలిసి పాలాభిషేకం చేశారు. తొలుత గట్టమ్మకు పూజలు చేసి, జిల్లా సంక్షేమ శాఖకు మంజూరైన బాలరక్షక్ వాహనాన్ని ప్రారంభించి, బంజారా కలిసి మంత్రి నృత్యం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని గిరిజనులకు సీఎం కేసీఆర్ నాలుగు రోజుల ముందే దసరా కానుకగా గిరిజనుల రిజర్వేషన్లను 10శాతానికి పెంచుతూ జీవో నంబర్ 33ను విడుదల చేసి శనివారం నుంచి అమలు చేస్తున్నారని తెలిపారు. గిరిజనుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఆరు శాతం ఉన్న రిజర్వేషన్లను 10శాతానికి పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించి, చల్లప్ప కమిషన్ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఆరేళ్ల క్రితం నివేదిక పంపారని తెలిపారు. కానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గిరిజనులను చిన్నచూపు చూస్తూ రిజర్వేషన్ల బిల్లుపై అశ్రద్ధ వహించి ఆమోదించకుండా కాలయాపన చేసిందని పేర్కొన్నారు.
దేశమంతా ఒక్కటైనప్పుడు అందరికీ హక్కులు కల్పించాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేస్తోందన్నారు. 2017లో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని తీర్మానించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా, కేంద్రం నాన్చుడు ధోరణి అవలంభించిందన్నారు. సీఎం కేసీఆర్ గిరిజన భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం జీవో నంబర్ 33ను విడుదల చేశారని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్ల అంశాన్ని 9వ చేర్చి చేయాలన్నారు.
కార్యక్రమంలో ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్, ఏఎస్పీ సుధీర్రామ్నాథ్ కేకన్, సీఐ రంజిత్కుమార్, ఎస్సై ఓంకార్యాదవ్, డీడబ్ల్యూఓ ప్రేమలత, చైల్డ్ ప్రొటక్షన్ ఆఫీసర్ ఓంకార్, డీసీసీబీ డైరెక్టర్ ఎర్రబెల్లి గోపాల్రావు, జడ్పీటీసీలు సకినాల భవాని, గై రుద్రమదేవి, ఎంపీపీ రజిత, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, ఎంపీటీసీలు విజయ్రాంనాయక్, శ్రీను, గండ్రకోట సుధీర్యాదవ్, వెల్పూరి సత్యనారాయణరావు, సూర్యనేని మురళీధర్రావు, సానికొమ్ము ఆదిరెడ్డి, గోవింద్నాయక్, బైకాని సాగర్, ముడుతనపల్లి మోహన్, సానికొమ్ము రమేశ్రెడ్డి, పట్టణ కార్యదర్శి బల్గూరి నవీన్ పాల్గొన్నారు.