నమస్తే తెలంగాణ నెట్వర్క్,సెప్టెంబర్ 29: ‘పంట పెట్టుబడి ఎట్ల? అన్న బాధ తీర్చిండు.. నీటి గోస లేకుండజేసిండు.. 24గంటలు కరంటిస్తాండు.. బీమా ఇచ్చి ధీమా కల్పించిండు. ఓ రైతుకు ఇంతకన్నా ఇంకేంగావాలె.. కేసీఆర్ రైతుల పక్షపాతి.. ఆయన దేశ పాలకుడు కావాలె.. మనలెక్క దేశం మొత్తం రైతులకు పథకాలు అందాలె.. అప్పుడే వ్యవసాయం పండుగైతది.. ప్రజలందరు సుభిక్షంగ బతుకుతరు’ అంటున్నరు అన్నదాతలు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలని, దేశాన్ని అన్ని విధాలా బాగు చేసే సత్తా ఆయనకే ఉందని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ కర్షకులను కంటికి రెప్పలా కాపాడుతున్న కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని అన్ని రాష్ర్టాల రైతులు కోరుకుంటున్నారని చెబుతున్నారు.
ఉమ్మడి పాలనలో కన్నీరు మిగిల్చిన ఎవుసాన్ని స్వరాష్ట్రంలో కనులపండువలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ది అని, ఆయన రైతుల పక్షపాతి అని, స్వయంగా రైతు అయిన కేసీఆర్ దేశ పాలకుడైతే దేశంలోని రైతులంతా బాగుపడుతారని అన్నదాతలు స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి తమ బతుకులను బాగు చేయాలని వివిధ రాష్ర్టాల రైతులంతా కోరుకుంటున్నారని చెబుతున్నారు. తెలంగాణలో రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరంటు తదితర సంక్షేమ పథకాల అమలుతో రైతుల జీవితాల్లో వెలుగులు నిండి వ్యవసాయం వృద్ధి చెందిందని, ఇలానే దేశమంతా అమలై రైతులు బాగుపడితే అన్నదాతలతో పాటు ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేసీఆర్ చూసుకుంటుంటే దేశంలోని బీజేపీ సర్కారు మాత్రం అధిక ధరలు, పన్నుల భారం వేసి పరిస్థితిని మొదటికి తెస్తున్నదని, బీజేపీ మెడలు వంచి సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని తెగేసి చెబుతున్నారు.
దేశమంతా సంక్షేమ పథకాలు
టేకుమట్ల, సెప్టెంబర్29: రాష్ట్రంలో కేసీఆర్ రైతు బంధువుగా మారి వారి రందిని తీర్చిన తీరు యావత్ దేశం చూస్తాంది. రైతుబంధు, 24 గంటల కరంట్ ఇయ్యాలని ఆశిస్తున్నారు. ఇది కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తేనే సాధ్యమవుతుంది. తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతులకు కేసీఆర్ సంక్షేమ పథకాలు పెట్టి ఆత్మగౌరవంతో బతికేలా చేశారు. ఉచిత కరంట్, సాగు నీరు, రైతుబంధు, రైతు బీమా, వడ్ల కొనుగోలు కేంద్రాలతో ఆదుకున్నాడు. ఇవన్నీ దేశవ్యాప్తం కావాలని వివిధ రాష్ర్టాల ప్రజలు, రైతులు కోరుకుంటున్నారు.
– నేరెళ్ల రామకృష్ణ గౌడ్, రైతు, బూర్నపల్లి, టేకుమట్ల
కష్టాలు తీరుతయ్..
గోవిందరావుపేట, సెప్టెంబర్29: రాష్ట్రంల రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.5వేల చొప్పున పెట్టుబడి అందిస్తున్న సంది అప్పులు చేసుడు తప్పింది. రైతు చనిపోయిన అనంతరం ఆ కుటుంబానికి రూ. 5 లక్షలిచ్చి భరోసా కల్పిస్తోంది. రైతుబంధు, రైతు బీమా దేశంలోని అందరి రైతులకు అందాలె. రైతులందరికీ బీమా, రైతుబంధు అందించడం కేసీఆర్కే సాధ్యం. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశంలోని రైతులందరి కష్టాలు తీరుతయ్.
దేశంల ఆత్మహత్యలు తగ్గుతయ్
పరకాల, సెప్టెంబర్ 29: రాష్ట్రంలో రైతులకు కేసీఆర్ పెట్టుబడి సాయాన్ని అందించి, నిరంతరం ఉచిత కరంటు, నీళ్లు ఇస్తాండు. పంట పండినంక మొత్తం వడ్లను మద్దతు ధరతో కొంటాండు. పైసల కోసం ఎదురుచూడకుండా ఖాతాల్ల వేస్తాండు. దీంతో రైతు కుటుంబాలు ఆనందంగా ఉంటున్నాయ్. కానీ కేంద్రంల మోదీ ఏం చేస్తలేడు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిండు. దీంతో ట్రాక్టర్ కిరాయిలు డబులైనయ్. ఎరువుల రేట్లు మస్తుగ పెరిగినయ్. రైతు చట్టాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఎంతో మంది రైతుల చావుకు కేంద్రం కారణమైంది. రాష్ట్రంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్న కేసీఆర్ ఢిల్లీలో ఉంటే దేశ ప్రజలందరికీ లాభం జరుగుతది. దేశంల ఆత్మహత్యలు తగ్గుతయ్. రైతులందరూ సంతోషంగా ఉంటరు. కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ పోవాలె, కేసీఆర్ సారు రావాలె.
– నీరటి సుధాకర్, రైతు, రాజిపేట, పరకాల
రైతాంగానికి భరోసా
నర్సింహులపేట, సెప్టెంబర్ 29: జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వస్తే రాష్ట్రంలో మాదిరిగా దేశంలోని అన్ని రాష్ర్టాల రైతాంగానికి భరోసా కల్పిస్తారు. ఉచిత విద్యుత్తో పాటు పంట పెట్టబడి సాయం అందిస్తే వారి బతుకులు బాగుపడుతాయి. ప్రధాన మంత్రి రైతుల మోటర్ల కాడ మీటర్లు పెట్టాలని చూస్తున్నాడు. కేసీఆర్ రైతుల పక్షాన పోరాటం చేస్తున్నారు. దేశం మొత్తం 24 గంటల పాటు ఉచిత కరంట్ ఇస్తే రైతుల దశ తిరుగుతుంది. బ్యాంకులకు పెద్ద ఎత్తున బాకీలు ఎగ్గొట్టిన వారిని వదిలి రైతులపై భారం వేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. దేశంలోని సంపదనంతా ప్రైవేట్ వారికి దోచిపెడుతున్నారు.
– బానోత్ విజయ, రైతు, బీమ్లాతండా, నర్సింహులపేట
అన్ని రాష్ర్టాలకు మేలు
నర్సింహులపేట, సెప్టెంబర్ 29: మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ఎరువుల ధరలు విపరీతంగా పెంచింది. రైతులకు ఉచితంగా కరంట్ ఇస్తే దేశంలో రూ. 1.45 లక్షల కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. బ్యాంకులను లూటీ చేసిన వారి నుంచి కమీషన్లు తీసుకుని లక్షల కోట్లు మాఫీ చేసిన ప్రధానమంత్రి రైతుల కోసం ఇవ్వడానికి చేతులు రావడం లేదు. రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన కరంట్ అందిస్తున్నారు. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్తే అన్ని రాష్ర్టాల్లోని రైతులకు మేలు జరుగుతుంది. దేశంల పంట పెట్టబడి సాయం, 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత కరంట్, రైతు బీమా అందిస్తే రైతులందరూ ఆర్థికంగా బాగుపడుతరు.
– లకావత్ శ్రీను, రూప్లాతండా, నర్సింహులపేట
ప్రధానయ్యే అర్హత ఆయనకుంది
దేవరుప్పుల, సెప్టెంబర్ 29: రైతు కుటుంబానికి చెందిన వాడు ప్రధానైతే మరో మారు హరిత విప్లవం వస్తుంది. ఇందుకు అన్ని అర్హతలు కేసీఆర్కు ఉన్నాయి. రాష్ట్రంలో అనతి కాలంలోనే వ్యవసాయ రంగంలో విప్లవాన్ని తెచ్చిన ఘనత ఆయనది. అన్నదాతలకు అన్ని వసతులు కల్పించిన కేసీఆర్ను దేశ రైతులు ఆదర్శంగా చూస్తున్నారు. గుజరాత్కు చెందిన ప్రధాని మోదీ వ్యాపారులకు కొమ్ము కాస్తూ, పేద వర్గాలను మరింత అప్పుల ఊబిలోకి నెడుతున్నారు. వ్యవసాయ రంగంపై పూర్తి స్థ్ధాయి అవగాహన ఉన్న కేసీఆర్ దేశ్ కీ నేత కావాలని అన్ని రాష్ర్టాల రైతులు కోరుకుంటున్నారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశం దశ మారుతుంది. దేశంలో నదుల అనుసంధానం, నిరంతర విద్యుత్, సాగు, తాగునీటి వ్యవస్థ, ఉచిత విద్య, వైద్యం అందించే దిశగా కృషి చేస్తాడనడంలో సందేహం లేదు.
-ఇంటి మల్లారెడ్డి, రైతు, నీర్మాల, దేవరుప్పుల
రైతులతో దేశం కూడా అభివృద్ధి
కేసముద్రం, సెప్టెంబర్ 29: కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ప్రధాన మంత్రి అయితే దేశంలోని రైతులందరూ బాగుపడుతారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలోని రైతుల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్, టీడీపీ పాలనలో విద్యుత్ కోసం ధర్నా, రాస్తారోకోలు జరిగాయి. రైతులు మరణిస్తే, వారి కుటుంబాలను ఆదుకోవడంలో కాంగ్రెస్, బీజేపీలు విఫలం చెందాయి. కేసీఆర్ 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఆయన ప్రధాని అయితే దేశవ్యాప్తంగా రైతులకు రైతుబంధు, రైతు బీమా అందుతాయి. పెట్టుబడికి ఇబ్బందులు ఉండవు. పంటలకు మద్దతు ధర లభిస్తుంది. సాగు నీటి సమస్య పరిష్కారమవుతుంది. రైతులు అభివృద్ధి చెందినట్లయితే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది.
– ఘంటా దామోదర్రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు, కేసముద్రం
సమయం ఆసన్నమైంది
నర్సంపేట రూరల్, సెప్టెంబర్29: కేసీఆర్కు రైతు కష్టాలు బాగా తెలుసు. వారి కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పక్కాగా అమలు చేస్తుండు. రైతు బంధు, రైతు బీమా పథకాలు మరెక్కడా లేవు. పంటల సాగుకు పెట్టుబడి, ఉచిత కరంటు ఇస్తుండు. దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఫథకాలు అమలవుతున్నాయా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. వ్యవసాయం దండుగ అన్న నోళ్లను మూయించి పండుగ అనేలా చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి.
– వడ్లకొండ కిషన్, రైతు, రామవరం, నర్సంపేట మండలం
సిరులు కురిపిస్తడు..
రైతుబిడ్డ అయిన కేసీఆర్ దేశాన్ని ఏలితే దేశమంతా సిరుల పంటలు పండుతయి. ఆంధ్రోళ్ల పాలనలో రాష్ట్రంలోని బోర్లు, బావులు, చెరువులు, కుంటలు ఎండిపోయి పాతాళంల పడిపోయిన గంగమ్మ తల్లిని భూమిపైకి తీసుకొచ్చిండు. ప్రభుత్వాల ఆదరణ లేక పల్లెల్లో బతుకు భారమై పిల్లాజెల్లలతో పట్టెడన్నం కోసం వలసలు పోయేందుకు పట్నాల బాట పట్టిన వారిని మళ్లీ తీసుకొచ్చి ఉపాధి చూపిండు. బీజేపోళ్లో, కాంగ్రెసోళ్లో దేశాన్ని ఏలితే రైతుల బతుకులు ఎప్పటిలాగే ఉంటయ్. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి దేశాన్ని ఏలాలని అందరూ కోరుకుంటాన్రు.
– చిన్నాల సాయిలు, రైతు, రాయపర్తి