‘ప్రజలకు మేలు చేయలేని కొందరు విమర్శలు చేస్తున్నరు. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నరు. వారికి కేంద్రం నుంచి ఏం తెచ్చారో చెప్పటం చేతకాదు. ఎంత తెచ్చారో తెలియదు. కానీ అర్థం పర్థం లేని ఆరోపణలు మాత్రం చేస్తున్నరు’ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు బీజేపీ నాయకులపై ఆగ్రహించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డితో కలిసి మహిళలకు ఆదివారం బతుకమ్మ పండుగ చీరలను పంపిణీ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పింఛన్ రూ.500 మాత్రమే ఇస్తున్నారని, బైక్ ఉంటే అది కూడా కట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
జయశంకర్ భూపాలపల్లి, నమస్తేతెలంగాణ/గణపురం, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధమైన,ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారని గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న బతుకమ్మ చీరలను ఆదివారం జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్ గ్రామపంచాయతీలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి పంపిణీ చేశారు. పలువురికి బతుకమ్మ చీరలతోపాటు ఆసరా పింఛన్ కార్డులు, కల్యాణలక్ష్మి, సీఎం సహాయ నిధి చెకులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయలేని కొందరు విమర్శలు చేస్తున్నారని, రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారని తెలిపారు. వారికి కేంద్రం నుంచి ఏం తెచ్చారో చెప్పటం చేతకాదని, ఎంత తెచ్చారో తెలియదన్నారు. కానీ వారు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. మహిళల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పింఛన్ రూ.500 మాత్రమే ఇస్తున్నారని, ద్విచక్రవాహనం ఉన్న వారికి అది కూడా కట్ చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప అందరికీ ఆసరాపింఛన్లు ఇస్తున్నారని అన్నారు.
ఇంతటి అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు మరోసారి అండగా నిలిచి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పండుగ పూట ఆడబిడ్డలు కొత్త బట్టలు కట్టుకొని సంతోషంగా బతుకమ్మ ఆడాలని ప్రభుత్వం చీరలను పంపిణీ చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు పెద్దన్నలా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దివాకర, డీపీవో ఆశాలత, జడ్పీ మాజీ చైర్మన్ సాంబారు సమ్మారావు, టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పోలుసాని లక్ష్మీనరసింహారావు, సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, సర్పంచులు నడిపెల్లి మధుసూదన్రావు, కుమారస్వామి, ఐలోని శశిరేఖ రాంచంద్రారెడ్డి, రామంచ భద్రయ్య, మామిడి రవి, గండ్ర సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్, చెన్నూరి రమాదేవీ మధుకర్, సుధర్మ మలహల్రావు, మంద అశోక్రెడ్డి, తహసీల్దార్ సతీశ్కుమార్, ఎంపీడీవో అరుంధతి పాల్గొన్నారు.
చెల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి వీరయ్యపల్లి వరకు సీసీ రోడ్డు నిర్మించేందుకు రూ.2కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి ప్రకటించారు. గతంలో మెడికల్ కాలేజీ కోసం నిధులు, జిల్లా ఆస్పత్రి భవన నిర్మాణం కోసం రూ.కోటీ 70లక్షలు మంజూరు చేశామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిపై పట్టుదల గల ఎమ్మెల్యే గండ్ర మీకు ఉండడం అదృష్టమన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ పండుగ కానుకగా చీర అందిస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి మండలం కమలాపూర్, గొల్లబుద్ధ్దారం, దీక్షకుంట, పంబాపూర్, నందిగామ, గణపురం మండలం నగరంపల్లి, అప్పయ్యపల్లి, సీతారాంపురం, కొండాపురం గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు, లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెకులను ఆదివారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కొత్తగా 10 లక్షల ఆసరా పింఛన్లు అందిస్తున్నారని తెలిపారు. ఇటీవల మరణించిన శ్యామూల హరీశ్రెడ్డి (రాంపూర్), బూరెడ్డి దయాకర్, శివారెడ్డి (దీక్ష కుంట), కొత్తూరి కిరణ్, మాసపత్రి చంద్రమౌళి, గుగులోత్ రామ్నాయక్ (గొల్లబుద్ధారం) కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చెల్పూర్ మాజీ సర్పంచ్, సీనియర్ నాయకుడు బల్గూరి సుధాకర్రావు బల్గూరి సుబ్బమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.