‘తెలంగాణలోని అన్ని గురుకులాల్లో రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. ఆ దిశగా విశేష కృషి చేస్తున్నది. పేదింటి బిడ్డలకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. విద్యార్థులు చదువులో ప్రతిభ కనబరుస్తూనే క్రీడల్లోనూ రాణించాలి. ఆటలతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుంది. విద్యార్థుల నడుమ స్నేహపూర్వక సంబంధాలు బలోపేతమవుతాయి.’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం రాయపర్తిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో 8వ జోనల్ క్రీడా పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేజీ టు పీజీ విద్యా విధానం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని అన్నారు.
రాయపర్తి, సెప్టెంబర్ 25 : గురుకులాల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో 8వ జోనల్ స్థాయి క్రీడా పోటీలను సోషల్ వెల్ఫేర్ రీజినల్ కో ఆర్డినేటర్ సూరినేని విద్యారాణి, అదనపు కలెక్టర్ బానోత్ హరిసింగ్తో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన, క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేజీ టు పీజీ విద్యా విధానం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని, రాష్ట్రంలో గురుకులాల సంఖ్య గణనీయంగా పెంచుతున్నట్లు చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందజేస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో గురుకులాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తున్నారని వివరించారు. చదువుతో పాటు ఆటల్లోనూ పాల్గొనాలని, సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందన్నారు. క్రీడా పోటీలతో విద్యార్థుల నడుమ స్నేహపూర్వక సంబంధాలు మెరుగుపడుతాయని చెప్పారు.
క్రీడా పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా 8వ జోన్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని 14 గురుకులాలకు చెందిన సుమారు 1100 మంది విద్యార్థినులు చేసిన మార్చ్ఫాస్ట్, వందన సమర్పణ ఆకట్టుకున్నాయి. సామూహిక, బృంద నృత్యాలు, ఏకపాత్రాభినయాలు అలరించాయి. త్రివర్ణ పతాకాలను చేతబూని నిర్వహించిన ర్యాలీ హైలెట్గా నిలిచింది. అలాగే, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి మండల పరిషత్ నిధులతో ఏర్పాటు చేయించిన హైమాస్ట్ లైట్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి ఆయన బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, మండల నాయకులు పూస మధు, గారె నర్సయ్య, బిల్ల రాధిక-సుభాష్రెడ్డి, అయిత రాంచందర్, ఎండీ నయీం, ఉస్మాన్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్, డీసీవో సమ్మయ్య, వైస్ ప్రిన్సిపాల్ దేవీప్రసాద్, ఏఆర్సీవో శరత్బాబు, లేతాకుల యాదవరెడ్డి, రెంటాల గోవర్ధన్రెడ్డి, వల్లెపు వెంకటేశ్వర్లు, ముద్రబోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.