తీరొక్కపూలతో పేర్చిన బతుకమ్మలతో వాకిళ్లన్నీ పూదోటలయ్యాయి. ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా ‘ఒక్కేసి పువ్వేసి చందమామా’ అంటూ ఆడబిడ్డలు ఆడిపాడగా ఊరూవాడలు మార్మోగాయి. సాయంత్రం వేళ విద్యుద్దీపాల వెలుగుల్లో అంతా ఒక్కచోట చేరి ఆడడంతో పూలజాతరను తలపించింది. హనుమకొండలోని చారిత్రక వేయిస్తంభాల ఆలయం సహా ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలు, మైదానాల్లో వందలాది మంది మహిళలతో సందడి నెలకొంది. అనంతరం ఒకరికొకరు వాయినం ఇచ్చి పుచ్చుకున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మను ఘనంగా జరుపుకొన్నారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆలయాలు, గ్రామ కూడళ్ల వద్దకు చేరి సంతోషంగా ఆడిపాడారు. పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. హనుమకొండ వేయిస్తంభాల దేవాలయంలో వందలాది మంది మహిళల ఆటాపాటల నడుమ బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. మహబూబాబాద్లోని రామాలయం, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఎంపీ మాలోత్ కవిత పాల్గొన్నారు. అలాగే జనగామలోని బతుకమ్మకుంట మైదానం, వరంగల్ కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం, భూపాలపల్లి, ములుగు జిల్లాకేంద్రాల్లో సంబురంగా జరిగాయి. అనంతరం మహిళలు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 25