జిల్లాలో మెడికల్ మాఫియా రోగులను రకరకాలుగా దోపిడీ చేస్తోంది. పలు ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలు సంపాదనే ధ్యేయంగా సిండికేట్గా మారాయి. చిన్న, పెద్ద హాస్పిటల్ అనే తేడా లేకుండా ముందే ధరలను నిర్ణయించుకొని ఒకేరకంగా వసూలు చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్ఎంపీ, పీఎంపీలకు కమీషన్లు ఇస్తూ దందా కొనసాగిస్తున్నాయి. రోగి ఆస్పత్రిలో చేరితే యాజమాన్యాలకు పండుగే అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. మరోవైపు హాస్పిటల్కు అనుబంధంగా సొంతంగా మెడికల్ షాపులు నిర్వహిస్తూ డాక్టర్ ద్వారా నాణ్యత లేని మందులను రాయిస్తూ లాభాలను ఆర్జిస్తున్నాయి. తమకు ఎక్కువ లాభం ఉండే, నాసిరకమైన లోకల్ కనీసం ఐదు నుంచి పది రకాలు రాయాలని డాక్టర్లను యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): జిల్లాలో పలు ప్రైవేట్ ఆసుపత్రులు మెడికల్ మాఫియాగా మారి నిలువుదోపిడీ చేస్తున్నాయి. ఆయా హాస్పిటళ్లకు రోగులను పంపేందుకు యాజమాన్యాలు జిల్లా వ్యాప్తంగా పీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. జిల్లాలోని 11 మండలాల నుంచి తమ వద్దకు రోగులను పంపిన ఆర్ఎంపీ, పీఎంపీలకు కమీషన్ ఇస్తున్నాయి. ఒక్కో వ్యాధికి ఒక్కో ధర చెల్లిస్తున్నాయి.
జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. యాజమాన్యాలు సిండికేట్గా మారి నిర్ణయించుకున్న ఫీజులను చిన్న, పెద్ద ఆసుపత్రులు అనే తేడా లేకుండా వసూలు చేస్తున్నాయి. వైద్య పరీక్షలు, గదులు, బెడ్ చార్జీలు, ఇతర వివిధ రకాల ఫీజులు ఒకేరకంగా వేస్తూ రోగుల నుంచి వసూలు చేస్తున్నాయి.
ప్రతి ప్రైవేట్ ఆసుపత్రికి అనుసంధానంగా మెడికల్ షాపులను నిర్వహిస్తున్నాయి. వైద్య పరీక్షలు చేసిన తర్వాత అదే మెడికల్ షాపులో లభించే మందులనే రాస్తున్నారు. అవసరం లేకున్నా భారీగా రాయడంతోపాటు సొంత మెడికల్ షాపులను నిర్వహిస్తూ రెండు చేతులా రోగులను దోచుకుంటున్నారు. ప్రిస్క్రిప్షన్లో లోకల్ మందులు, అధికంగా లాభం ఉండే మందులు మాత్రమే ఉండేలా చూసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కనీసం ఐదు నుంచి పది రకాల మందులను రాయాలని యాజమాన్యాలు సంబంధిత డాక్టర్కు ఆదేశాలు జారీ చేస్తారు. కమీషన్లు, గిఫ్ట్లు, విదేశీ టూర్లు అంటూ ఆయా కంపెనీలు ఆఫర్ ఇస్తుండడంతో చెప్పినప్రకారం నాణ్యతలేని మందులు, సిరప్లు, సిరంజీలను రాస్తున్నారు. వాటిలో ఒక్కటి కూడా నాణ్యమైన మందులు ఉండడం లేదు. దీంతో ఆస్పత్రిలో చేరిన రెండు, రోజులు చికిత్స అందించి పరిస్థితి విషమించిందని వరంగల్, హనుమకొండ, హైదరాబాద్లకు రెఫర్ చేస్తున్నారు. అందుకు తమ ఆసుపత్రి అంబులెన్స్ సిద్ధంగా ఉందంటూ మరో దోపిడీకి తెరలేపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.