‘ప్రజల సుభిక్షం కోసం యజ్ఞయాగాదులు చేస్తూ.. సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణ కోసం కృషి చేస్తూ.. అన్ని మతాలను గౌరవిస్తూ.. మతసామరస్యాన్ని కాపాడుతున్న కేసీఆర్, దేశ రాజకీయాల్లోకి వస్తే ధర్మసంస్థాపన సాధ్యమవుతుంది’ అని ధార్మికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో 21కులాల అర్చక వ్యవస్థను కాపాడుతూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ అని, ఆధ్యాత్మికత విషయంలో దేశంలో ఆయనతో పోటీపడే వ్యక్తి ఎవరూలేరని చెబుతున్నారు. పేద బ్రాహ్మణులు, అర్చకుల సంక్షేమానికి, ఆలయాల అభివృద్ధికి ఇప్పటివరకు రూ.2వేల కోట్లకు పైగా ఖర్చు చేయడం చారిత్రాత్మకమని కొనియాడుతున్నారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 23
దేశంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాలన్నా సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ధార్మికవేత్తలు వేనోల్లా కోరుతున్నారు. యజ్ఞయాగాదులను చేపట్టిన నిజమైన ధార్మికుడిగా సీఎం కేసీఆర్ పేరు తెచ్చుకున్నారని చెబుతున్నారు. దేశంలో అన్ని మతాలకు సముచిత స్థానం దక్కాలంటే కేసీఆర్తో సాధ్యమని అంటున్నారు. అయుత చండీయాగం, గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించి.. బ్రాహ్మణ పరిషత్కు రూపకల్పనచేసి, శిథిలావస్థకు చేరిన ఆలయాలను బాగు చేసి, ధూపదీప నైవేద్యాల కోసం ప్రత్యేకంగా పథకాన్ని ప్రారంభించి, పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ దేశ పాలకుడు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కిచెబుతున్నారు. కాళేశ్వరం, వేములవాడ, యాదగిరిగుట్ట ఆలయాలకు పూర్వవైభవం తెచ్చి, బతుకమ్మ, బోనాలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించి, మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను ప్రపంచమే తిరిగి చూసేలా నిర్వహిస్తూ కేసీఆర్ నిజమైన ధార్మికవేత్తగా నిలిచిపోయారని కొనియాడుతున్నారు. ఓ వైపు ఆధ్యాత్మికం, మరోవైపు అభివృద్ధి, సంక్షేమాలపై దృష్టిపెట్టి అన్ని మతాలనూ గౌరవిస్తూ మతసామరస్యాన్ని చాటుతున్న కేసీఆరే ధర్మరక్షకుడు అని స్పష్టం చేస్తున్నారు.
కురవి, సెప్టెంబర్ 23: బంగారు తెలంగాణ తరహాలోనే దేశాన్ని బంగారుమయంగా మార్చేందుకు కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి. జనం మెచ్చిన నాయకుడు. ప్రాణాలొడ్డి రాష్ర్టాన్ని సాధించి, బంగారు తెలంగాణ నిర్మాణంలో అలుపెరుగని బాటసారి. కాళేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ కాలంలో నిర్మించి రైతుబంధువుగా మారాడు. అన్నివర్గాల ప్రజలకు ఆపద్బాంధవుడు. ప్రజల సుభిక్షం కోసం.. సంస్కృతీసంప్రదాయాల రక్షకుడిలా యజ్ఞయాగాదులు చేసిన నిజమైన ధార్మికుడు. రాష్ట్రంలో జరుగుతు న్న అభివృద్ధి, సంక్షేమాలను పొరుగు రాష్ర్టాలు పొగుడుతున్నాయి. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే పేదలకు మంచి రోజులు వస్తాయి. మరిన్ని సంక్షేమ పథకాలు దేశ ప్రజలకు అందుతాయి.
– తాటికొండ పుణ్యమూర్తి, వీరభద్రస్వామి ఆలయ పూజారి, కురవి
కాళేశ్వరం, సెప్టెంబర్23: తెలంగాణ ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు దేశ రాజకీయాల్లోకి రావడం గర్వించే విషయం. భారతీయతే నినాదంగా ఏ పార్టీ చేయలేని విధంగా రాష్ట్రంలో 2015 లో అయుత చండీయాగం, గోదావరి మాత పుష్కరాలు వైభవంగా నిర్వహించారు. సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించేలా బ్రాహ్మణ పరిషత్ రూపకల్పన, శిథిల, గ్రామీణ దేవాలయాలకు దూప దీప నైవేద్యం పథకం ద్వారా పేద బ్రాహ్మణుల్లో ఆత్మవిశ్వాసం, గౌరవం పెంచారు. కాళేశ్వరం, వేములవాడ, యాదగిరిగుట్ట దేవాలయాల ఆధునీకరణకు భారీ ఎత్తున నిధులు వెచ్చించి ఆధ్యాత్మిక, తాత్విక చింతనకు ఆయువు పోశారు. బతుకమ్మ, బోనాలు రాష్ట్ర పండుగలుగా ప్రకటించడం, మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను వైభవంగా నిర్వహించడం ఆయనకే చెల్లింది. కేసీఆర్ దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తే ప్రతిభకు, విజ్ఞానవంతులకు గౌరవం లభించి తెలంగాణ కీర్తి పతాకస్థాయికి చేరుతుంది. వారికి అంతటా విజయం చేకూరాలని బ్రాహ్మణ జాతి సంపూర్ణ ఆశీస్సులు అందిస్తుంది.
– మాడుగుల నారాయణ, పండితుడు, కాళేశ్వరం
మంగపేట, సెప్టెంబర్23: సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత దేశ రాజకీయాల్లోకి రావడం చారిత్రక అవసరం. తలపెట్టిన పనిలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లడం కేసీఆర్ నైజం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పాలన అందిస్తున్నాడు. దేశంలోనే రాష్ర్టాన్ని ఆదర్శంగా నిలబెట్టాడు. ధార్మికవేత్త, ఆధ్యాత్మిక గురువు, రైతు బాంధవుడు, నిత్యం లోకకల్యాణాన్ని ఆకాంక్షించే దార్శనికుడు. ఇలా అనేక సుగుణాలున్న కేసీఆర్ను దేశ రాజకీయాల్లోకి రావాలని అన్ని ప్రాంతాల వారు బలంగా కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రజాసంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్ కచ్చితంగా దేశ రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
– బాడిశ రామకృష్ణస్వామి, శ్రీనాగులమ్మ ఆలయ ధర్మకర్త, ప్రధాన పూజారి, లక్ష్మీనర్సాపురం, మంగపేట
దేవరుప్పుల, సెప్టెంబర్ 23: దేశానికి తెలంగాణ మార్కు పాలన కావాలని అన్ని రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమ వద్ద ఉంటే బాగుంటుందని ఆకాంక్షిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేస్తున్న అధిక పన్నుల భారం మోయలేక పేదలు చతికిల పడుతున్నారు. కేసీఆర్ లాంటి నేత జాతీయ నాయకుడైతే దేశానికి మేలు జరుగుతుంది. ఆయన పురాత న ఆలయాలను పునరుద్ధరిస్తూ గ్రామాల్లోని దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం పథకం కింద పూజారులను ఆదుకుంటున్నారు. ఓ వైపు ఆధ్యాత్మికం, మరోవైపు అభివృద్ధి, సంక్షేమాలపై దృష్టి సారించి మత సామరస్యాన్ని చాటుతున్నారు. దేశంపై అణువణువు అవగాహన ఉన్న నేత. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశమంతా అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయాధారిత దేశంలో ఆయనే కరెక్ట్ పర్సన్.
– పెద్దాపురం వెంకటేశ్వర శర్మ, అర్చకుడు, దేవరుప్పుల
పాలకుర్తి, సెప్టెంబర్ 23: రాష్ట్రంలోని అన్ని ఆలయాలను కేసీఆర్ ధార్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాలి. అప్పుడే దేశం ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతుంది. రాష్ట్రం వచ్చిన తర్వాతే ఆలయాలకు పూర్వవైభవం వచ్చింది. ముఖ్యంగా యాదాద్రి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసిపోనట్లుగా తీర్చిదిద్దారు. ధూప దీప, నైవేద్యం పథకం కింద చిన్న చిన్న ఆలయాలకు రూ. 2500 నుంచి రూ.6000 వరకు నిధులు విడుదల చేస్తున్న గొప్ప వ్యక్తి.
– దేవగిరి అనిల్శర్మ, ముఖ్య అర్చకులు, పాలకుర్తి దేవస్థానం
మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్ 23: కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తే దేశ ప్రజలకు మంచి జరుగుతది. ప్రస్తుతం ఆయన నాయకత్వం దేశానికి అవసరం. రాష్ట్రంలో కేసీఆర్ ధార్మిక వేత్తలకు సముచిత స్థానం కల్పిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో యాదాద్రి వంటి ఆలయాలను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. ఎండోమెంట్ విధానం ద్వారా పురోహితులకు మంచి వేతనాలతో పాటుగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కేసీఆర్ ఆలోచనా విధానంతో ఆన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారు.
– ముడుంబై లక్ష్మీనారాయణ, ధార్మిక వేత్త
మట్టెవాడ, సెప్టెంబర్23: వేల సంవత్సరాల పాటు చెక్కు చెదర కుండా సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని నిర్మింపజేశారు. లక్ష్మీనృసింహ స్వామి ఆశీస్సులతో ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలి. ఆధ్మాత్మిక భావం కలిగిన ఆయనతో రాష్ట్రంలో అనేక దేవాలయాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. అనేక పుస్తకాలు చదివి ధార్మికవేత్తలా పనిచేస్తున్నాడు. ఆయన సీఎం కావడం మనందరి అదృష్టంగా భావిస్తున్నా. ఆయన దేశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ను ప్రజలు నిండుమనస్సుతో ఆశీర్వదిస్తే జాతీయ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకువచ్చి దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతారు.
– ఆరుట్ల శ్రీనివాస్, మట్టెవాడ, వరంగల్
పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 23: ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ మంచి జరుగుతుంది. మంచి పాలన చేస్తున్న కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే అందరికీ మేలు కలుగుతుంది. దేశానికి రాజు నిస్వార్థంగా పనిచేసినప్పుడు ప్రజలు కూడా సుఖ సంతోషాలతో బతుకుతారు. అలాగే పేదల బాగు కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆయన పాలన ధర్మం వైపు నడుస్తోంది. కులమతాలకతీతంగా, పేద, ధనిక తారతమ్యం లేకుండా పాలన చేస్తున్న కేసీఆర్ అందరి బంధువుగా మెలుగుతున్నాడు. అధర్మానికి వ్యతిరేకంగా నిష్టతో ఉన్న ఆయనకు భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి.
– బండారు సాయి నారాయణ, ధార్మికవేత్త