మడికొండ, సెప్టెంబర్ 23 : ఆరుగురు గంజాయి స్మగ్లర్లపై మడికొండ పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. మడికొండ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాజీపేట ఏసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరుగురిపై ఒకేసారి పీడీ యాక్టు నమోదు చేయడం తొలిసారి అన్నారు. జూన్ 14న ఔటర్ రింగ్ రోడ్డుపై టేకులగూడెం క్రాస్ వద్ద టాస్క్ఫోర్స్, మడికొండ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు రెండు కార్లలో తరలిస్తున్న 520 కేజీల గంజాయితో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి రెండు కార్లు, మొబైల్స్ను స్వాధీనం చేసుకుని, అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు చెప్పారు.
వీరిలో మెదక్ జిల్లా రేగోడు మండలం మర్పల్లి గ్రామానికి చెందిన బేగరి సందీప్ కుమార్, పోచారం శివరాజు, పోచారం ధనరాజ్, పోచారం గ్రామానికి చెందిన పల్లె వినోద్ కుమార్, సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన సర్కూర్ రాహుల్, రాయకోడు గ్రామానికి చెందిన ఏర్పుల విశాల్ ఉన్నట్లు వివరించారు. వరంగల్ సీపీ తరుణ్జోషి ఉత్తర్వుల మేరకు సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్కుమార్ ఆదేశాల ప్రకారం ఈ ఆరుగురు నిందితులపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు తెలిపారు. చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న వీరి వద్దకు వెళ్లి పీడీయాక్ట్ ఉత్తర్వులను అందజేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఈ ఆరుగురు మరో ఏడాది పాటు జైలులో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి స్మగ్లర్లు, అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు కాజీపేట ఏసీపీ తెలిపారు. యువత పెడదారులు పట్టకుండా సన్మార్గంలో నడుచుకోవాలన్నారు. వ్యసనాలకు బానిసలుగా మారి బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని సూచించారు. సమావేశంలో ఇన్స్పెక్టర్ వేణు, ఎస్సైలు నరసింహారావు, దివ్య, సిబ్బంది పాల్గొన్నారు.