పరకాల, సెప్టెంబర్ 18 : పట్టణంలో పెద్ద ఎత్తున చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా పూర్తిచేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. పనులు పూర్తయితే పట్టణ రూపురేఖలు మారుతాయని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీ భవనం, ఇంటిగ్రేటెడ్ వెజ్నాన్వెజ్ మార్కెట్, వైకుంఠధామం, ఎంపీడీవో కార్యాలయం నుంచి నూతన మున్సిపాలిటీ కార్యాలయం వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల ఆలస్యానికి గల కారణాలను అధికారులు, కాంట్రాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పనుల్లో జాప్యంతో కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులను వేగవంతం చేసి డిసెంబర్ వరకు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో మున్సిపాలిటీలో అత్యధిక నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే పట్టణంలో పూర్తిస్థాయిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించినట్లు వివరించారు. దాదాపు 13 కోట్ల రూపాయల నిధులతో అంతర్గత రోడ్లను నిర్మించినట్లు తెలిపారు.వంద పడకల దవాఖాన నిర్మాణం వేగంగా జరుగుతుందని వివరించారు. మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషాంజన్స్వామి, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, మున్సిపల్ ఏఈ వంశీ కృష్ణ, కౌన్సిలర్లు ఒంటేరు సారయ్య, అడప రాము, ఏకు రాజు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను, నాయకులు చందుపట్ల తిరుపతి రెడ్డి, పసుల రమేశ్, శనిగరం నవీన్, నల్లెల్ల అనిల్, గొర్రె రాజు పాల్గొన్నారు.