భారతదేశంలో తెలంగాణ భాగస్వామ్యమై 75వ ఏట అడుగిడిన సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఆయా జిల్లా కేంద్రాల్లో ముఖ్య అతిథులు జాతీయ జెండాలను ఎగురవేసి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు కట్టిపడేశాయి. జనగామ జిల్లా సమీకృత కలెక్టరేట్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవందనం స్వీకరించారు.
మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో మంత్రి సత్యవతి రాథోడ్, హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ములుగు కలెక్టరేట్లో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు జాతీయ జెండాను ఎగురవేశారు. వరంగల్ సీకేఎం కళాశాల మైదానంలో ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ ఆవరణలో ప్రభుత్వ సలహాదారు అనురాగ్శర్మ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. పలుచోట్ల సమరయోధులను సన్మానించారు.
– పోచమ్మ మైదాన్, సెప్టెంబర్ 17