తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సాక్షిగా గిరిజనుల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 10శాతం పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ర్టాన్ని, దేశాన్ని ఏండ్లకేండ్లు పాలించిన పార్టీలు తమను ఓటుబ్యాంకుగానే చూశాయని, ముఖ్యమంత్రి కేసీఆరే తమను మనుషులుగా గుర్తించారని ఆనందం వెలిబుచ్చుతున్నారు. ఎన్నో ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోని తమ కోరికను నెరవేర్చిన సీఎం కేసీఆర్ తమకు ఆరాధ్యదైవమని స్పష్టం చేస్తున్నారు.
ఆత్మకూరు, సెప్టెంబర్ 17 : గిరిజన బంధు ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్కు, పురపాలక శాఖ మంతి కేటీఆర్కు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చిత్రపటాలకు శనివారం సాయంత్రం ఆత్మకూరు మండలం కటాక్షపురంలో గిరిజన మహిళలు, యువకులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మచ్చిక యాదగిరి, రెడ్ క్రాస్ డైరెక్టర్ బుచ్చిరెడ్డి, మండల ఎస్టీసెల్ అధ్యక్షుడు అజ్మీరా రాజు, మాజీ డైరెక్టర్ భూక్యా రాజు, గ్రామ ఎస్టీసెల్ అధ్యక్షుడు అజ్మీరా రవినాయక్, వార్డు సభ్యులు కుడుతాల రమేశ్, డాక్టర్ సర్దార్ పాల్గొన్నారు.
ఉద్యోగార్థులకు శుభవార్తే..
భూపాలపల్లి రూరల్, సెప్టెంబర్ 17 : హైదరాబాద్లో శనివారం జరిగిన గిరిజన సమ్మేళనంలో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు పెంచుతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించడం శుభపరిణామం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వివిధ కేటగిరీల కింద ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కావడం, గిరిజన నిరుద్యోగుల అభ్యర్థులకు రిజర్వేషన్ కోటా పెంచడం గొప్ప విషయం. సత్వరమే ఉత్తర్వులు జారీ చేసి ఇప్పటికే వెలువడిన నోటిఫికేషన్లకు కూడా వర్తింపజేయాలి. రిజర్వేషన్ పెంచితే వైద్య, ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎక్కువ సీట్లు వస్తాయి. మెరుగైన విద్యతో ఉన్నత ఉద్యోగాలు సాధిస్తారు.
– బానోత్ సమ్మయ్య, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, భూపాలపల్లి
గిరిజన సమాజం రుణపడి ఉంటుంది
హనుమకొండ, సెప్టెంబర్ 17 : సీఎం కేసీఆర్ నిర్ణయంతో గిరిజన సమాజం ఆయనకు ఎంతో రుణపడి ఉంటుంది. గిరిజన రిజర్వేషన్ పెంపు ప్రకటన చేసినందుకు యావత్ తెలంగాణ ఆదివాసీ, గిరిజన సమాజం తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన మాట ప్రకారం ఆదివాసీ, బంజారా భవన్ నిర్మించడం గొప్ప విషయం. అలాగే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రిజర్వేషన్ను 6నుంచి 10శాతానికి పెంచడం మంచిదని భావించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రమే రిజర్వేషన్ పెంచుతుందని ప్రకటించడం శుభపరిణామం.
– హుస్సేన్నాయక్, గిరిజన శక్తి సంఘ అధ్యక్షుడు,
కాకతీయ యూనివర్సిటీ
రుణపడి ఉంటాం
మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్ 17 : తెలంగాణలో ఉన్న గిరిజనులు మొత్తం సీఎం కేసీఆర్కు ఎంతో రుణపడి ఉంటాం. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిచేకూర్చడంతో పాటు రిజర్వేషన్ 10శాతం ఇవ్వడం విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఇవ్వాళ విద్య, ఉద్యోగాలకు ఈ రిజర్వేషన్ ఎంతో ఉపయోగ పడుతుంది. రిజర్వేషన్ నిర్ణయంపై యావత్ తెలంగాణ గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్తో రాష్ట్రంలో ఉన్న గిరిజనులు మరింత బలోపేతం అవుతారు. – లునావత్ ప్రియాంక, జడ్పీటీసీ మానుకోట
30 ఏళ్ల కల సాకారం..
ములుగు, సెప్టెంబర్17(నమస్తే తెలంగాణ) : గత 30 ఏళ్లుగా రిజర్వేషన్ల కోసం గిరిజనులు రెండు వర్గాలుగా పోరాటాలు చేస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపినప్పటికీ పరిష్కారం కాని సమస్యను సీఎం కేసీఆర్ ఒకే ఒక్క మాటతో కలను సాకారం చేయబోతున్నారు. అన్ని వర్గాలను సమదృష్టితో చూస్తున్న రాష్ట్ర సర్కారు మరో ముందడుగు వేసి రిజర్వేషన్ల విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. కొమురంభీం భవన్ ప్రారంభ వేదికగా కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం గిరిజనులపై ఉన్న అభిమానానికి నిదర్శనం. – బడే నాగజ్యోతి, ములుగు జడ్పీ వైస్ చైర్పర్సన్
కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు..
రాయపర్తి, సెప్టెంబర్ 17 : గిరిజనుల రిజర్వేషన్లను 10శాతానికి పెంచుతామని ప్రకటించిన సీఎం కేసీఆర్ మరోమారు మనసున్న మారాజుగా చరిత్ర పుటల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. దేశంలోని రాజకీయ పార్టీలు, నేతలంతా గిరిజన సమాజాన్ని కేవలం ఓటు బ్యాంకులుగానే పరిగణించాయే తప్ప ఏనాడూ మనుషులుగా మమల్ని గుర్తించలేదు. కానీ తమ ఆవేదనను గుర్తించి గిరిజన జాతికి న్యాయం చేయాలన్న తలంపుతో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో పనిలేకుండా రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం మా సమాజానికి శుభపరిణామం.
– భూక్యా భధ్రూనాయక్, పానీష్తండా సర్పంచ్
రిజర్వేషన్ పెంచడం హర్షణీయం
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 17 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరుకు మాత్రమే మేం గిరిజనులం. మాకు ఏ పథకం కూడా సక్రమంగా రాలే. కొండలు, గుట్టలు, ఎత్తు పల్లాల మట్టిదిబ్బల్లో ఇప్పటికీ బతికే మాకు తెలంగాణ వచ్చిన తర్వాతే ఓ ప్రత్యేకత గుర్తించి వచ్చింది. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే. తండాలను గ్రామ పంచాయతీలను మార్చి ప్రజాప్రతినిధులుగా నిలబెట్టిన ఘనత ఆయనదే. ఇప్పుడు ఆదివాసీ, బంజా రా భవన్ కూడా కట్టించి ఇస్తడని కలలో కూడా అనుకోలే. కేంద్ర ఒప్పుకోకపోయినా వారంల అమలు చేస్తానని భరోసా ఇచ్చిండు. గిసోంటి ముఖ్యమంత్రి ఉంటే ఏ రాష్ట్రమైనా మంచిగుంటది. కేసీఆర్ తెలంగాణకే కాదు దేశ రాజకీయాల్లోకి ఉండే ప్రజలందరూ బాగుపడుతరు.
– భూక్య కవిత, రాంనగర్ సర్పంచ్, భీమదేవరపల్లి
గిరిజనులకు పండుగ రోజు
నర్సింహులపేట, సెప్టెంబర్ 17 : గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రానికి అసెం బ్లీ తీర్మానం పంపినా ఇప్పటివరకు అమలు చేయకపోవడం దురదృష్టకరం. తాజాగా హైదరాబాద్లోని గిరిజన భవనం నిర్మాణ ప్రారంభోత్సవం సందర్భం గా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ ప్రకటించడం సంతోషదాయకం. ఇప్పటికే వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్, గృహాలకు 101 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రకటించడం మరువలేని రోజు, పండుగ రోజు. – డీఎస్ రెడ్యానాయక్ ఎమ్మెల్యే డోర్నకల్
చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం
నర్సింహులపేట, సెప్టెంబర్ 17 : గిరిజన పక్షపాతి, పిల్లల భవిష్యత్ కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. ఎన్నో ఏళ్లుగా తండాలను గ్రామ పంచాయయతీలుగా మార్చాలన్న ఆకాంక్షను సైతం తీర్చారు. 10శాతం గిరిజన రిజర్వేషన్ కోసం ఏడేండ్ల క్రితం కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా మోదీ సర్కారు పట్టించుకోలేదు. గిరిజనులకు ఎంతో చేస్తున్నమని గొప్పలు చెప్పుకుంది తప్ప చేసిందేలేదు. గిరిజనుల మనస్సు ఎరిగిన వ్యక్తిగా ముఖ్యమంత్రి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. గిరిబిడ్డల భవిష్యత్కు బంగారు బాటలు వేశారు. చరిత్రాత్మకమైన నిర్ణయాలను నిండు మనస్సుతో స్వాగతిస్తున్నాం. ఆయనకు రుణపడి ఉంటాం.
– మాలోత్ కవిత, మహబూబాబాద్ ఎంపీ
మా పాలిట దేవుడు కేసీఆర్..
జనగామ చౌరస్తా, సెప్టెంబర్ 17 : ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు పెంచుతున్నట్లు ప్రకటించి సీఎం కేసీఆర్ మా గిరిజనుల పాలిట దేవుడయ్యాడు. ఎంతో కాలంగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది వరం. ఇచ్చిన మాట ప్రకారం తండాలను గ్రామ పంచాయతీలు చేసిండు. వ్యవసాయంపైనే ఎక్కువగా ఆధారపడి బతుకుతున్న గిరిజనులకు ఇప్పుడు పోడు భూములను కూడా పంచిస్తామంటుండు. భూమిలేని నిరుపేద గిరిజనులకు ‘గిరిజన బంధు’ ఇస్తానని చెప్పి సంతోషం నింపిండు. దీనిని రాజకీయ పార్టీలకతీతంగా మేము స్వాగతిస్తున్నాం. కేసీఆర్కు మా గిరిజన జాతి బిడ్డల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు, రాంరాం.
– మూడ్ లక్ష్మణ్ నాయక్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జనగామ
నిరుద్యోగ యవతకు మేలు
సంగెం, సెప్టెంబర్ 17 : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గిరిజన రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయంతో నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేస్తుంది. ఇప్పటికే తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజన సంక్షేమానికి కృషిచేస్తున్నారు. అలాగే ఇప్పుడు రిజర్వేషన్ పెంచుతామని ప్రకటించి కొండంత భరోసా ఇచ్చారు. కేసీఆర్ పాలనలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటున్నారు.
– గుగులోత్ వీరమ్మ, ఎంపీటీసీ సంగెం
10శాతానికి పెంపు
ములుగు, సెప్టెంబర్17(నమస్తే తెలంగాణ) : 6శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్లను 10శాతం వరకు పెంచుతామని ప్రకటించడం ఎంతో గొప్ప విషయం. గిరిజనులు అనేక సంవత్సరాలుగా రిజర్వేషన్ల పెంపు కోసం పలు ప్రభుత్వాలకు విన్నవించి పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎనిమిదేళ్ల కాలంలోనే రాష్ర్టాన్ని ప్రగతిబాట పట్టించారు. గిరిజనులకు రిజర్వేషన్లు తక్కువగా ఉండడం వల్ల ఎన్నో ఏళ్లుగా విద్యార్థులు, ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు ఈ విద్య, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.
– భూక్య అమర్సింగ్, ములుగు విద్యార్థి నాయకుడు