నర్సంపేట, మార్చి 1: నిరుపేదల కోసం నర్సంపేట నియోజకవర్గానికి అదనంగా 635 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గ ప్రజలకు గొప్ప శుభవార్త తెలిపిందని హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మరో 635 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో జారీ చేశారని వివరించారు. స్థలం ఉన్న వారు ఇంటిని నిర్మించుకునే వెసులుబాటును కూడా త్వరలోనే ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉందన్నారు. ముందుగా నర్సంపేట పట్టణంలో గతంలో చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను ఈ నెల 30లోగా ప్రకటించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. జీవో నంబర్ 58 ప్రకారం 125 గజాలలోపు ప్రభుత్వ స్థలంలో ఇండ్లు నిర్మించుకునే వారికి ఉచితంగా పట్టాలు ఇవ్వాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలో సొంత ఇంటి స్థలం కూడా లేని నిరుపేద కుటుంబాలను గుర్తించి, వారికి పట్టాలు ఇచ్చేవిధంగా సర్వే నిర్వహించి, ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. తదనంతరం గ్రామాల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎంపిక ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సూచించారు. నర్సంపేట నియోజకవర్గానికి అదనంగా వచ్చిన ఇళ్ల వల్ల అర్హులకు మేలు జరుగుతుందన్నారు. లబ్ధిదారుల జాబితాను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నర్సంపేట పట్టణ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు.
కాకతీయుల కాలం నాటి గుండం శివాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పూజలు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుండంలో ఉన్న కాకతీయుల నాటి పురాతనమైన శివాలయాన్ని ఆయన సందర్శించారు. అనంతరం శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, జడ్పీటీసీ పాల్గొన్నారు.
నెక్కొండ: నెక్కొండతండాకు చెందిన చిన్నారులు భూక్యా వెంకన్న, తిరుమల్ కుటుంబానికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అండగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారుల చదువుకు గురుకుల వసతితోపాటు పిల్లల తల్లిదండ్రులు వీరు-శాంతమ్మకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేశారు. ఈ మేరకు క్యాంపు కార్యాలయానికి చిన్నారులను పిలిపించుకొని మాట్లాడారు. కార్యక్రమంలో నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము, మాజీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఈ యాకయ్య, కోటిరెడ్డి పాల్గొన్నారు.