జిల్లాల పునర్విభజనతో పాలన ప్రజలకు చేరువైంది. 2016 అక్టోబర్ 11న కొత్త జిల్లాలు ఉనికిలోకి రాగా, ఏడేళ్లలో ఉమ్మడి వరంగల్ జిల్లా అద్భుత ప్రగతి సాధించింది. అనతికాలంలోని ఆరు జిల్లాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. దూరభారం తగ్గడంతో సమస్యలు వెనువెంటనే పరిష్కారానికి నోచుకుంటున్నాయి. గతంతో పోల్చితే కొత్త జిల్లాల విస్తీర్ణం తక్కువగా ఉండడం వల్ల అధికారయంత్రాంగానికి గ్రామాలు, మండలాలు చుట్టి రావడమే గాక ప్రభుత్వ పథకాల అమలుపై పర్యవేక్షణ సులభమైంది. అంతేగాక చిన్న జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లాకేంద్రం సహా చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఊహించని విధంగా మార్పులు వచ్చాయి. అన్ని కార్యాలయాలు ఏర్పడడం, కొత్త కొత్త దుకాణాలు, వ్యాపారాలు పెరుగడం వల్ల ప్రజలు ఆర్థికాభివృద్ధి సాధించే వీలు కలిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల్లో అత్యాధునిక సమీకృత కలెక్టరేట్లు నిర్మించడంతో పాటు వేలాది కోట్లతో నగరాలు, పట్టణాలను తీర్చిదిద్దుతున్నది. అదేస్థాయిలో ప్రతి పల్లెకూ సకల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తుండడంతో పాటు విద్య, వైద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. కేసీఆర్ సర్కారు ప్రోత్సాహం, కొంగొత్త ఆలోచనలతో చిన్న జిల్లాలు ప్రగతిపథంలో దూసుకుపోతూ నేడు ఎనిమిదో వసంతంలోకి అడుగుపెడుతున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి. అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ) : నేను 20 ఏళ్లుగా భూపాలపల్లిలోనే ఉంటూ ఫొటో స్టూడియో నడిపిస్తున్నా. కేవలం సింగరేణి ప్రాంతం కావడంతో కొంతవరకు షాపు మంచిగానే నడిచేది. అప్పట్లో జనం ఎక్కువగా ఉండేవారు కాదు. భూపాలపల్లి జిల్లాగా మారిన తర్వాత భూపాలపల్లి టౌన్ ఊహించని విధంగా విస్తరించింది. రకరకాల షాపులు పెరిగాయి. జనాభా కూడా చాలా పెరిగింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే ఏర్పాటయ్యాయి. దీని వల్ల మా ఫొటో స్టూడియో వ్యాపారం కూడా ఊపందుకుంది. ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. ఫంక్షన్లు, ఊవెంట్లు, ప్రభుత్వ కార్యక్రమాల ప్రోగ్రాంలతో చేతినిండా పని ఉంటోంది. కొత్త జిల్లా ఏర్పడకపోతే నాలాంటి వాళ్లకు పని ఉండకపోయేది.
వర్ధన్నపేట, అక్టోబర్ 10 : చిన్న జిల్లాల ఏర్పాటుతో నిత్యం ఉన్నతాధికారులు అందుబాటులో ఉంటున్నారు. ప్రజలు వారి సమస్యలను త్వరితగతిన అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకుంటున్నారు. మండల కేంద్రాలు, గ్రామాలను సందర్శించి అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పర్యవేక్షణ సులభమైంది. రాష్ట్ర ప్రభుత్వం వర్ధన్నపేటను మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసింది. సీఎం కేసీఆర్ చిన్న జిల్లాను ఏర్పాటు చేయడం వల్లే ఇది సాధ్యమైంది. దూరదృష్టితో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి.
పాలకుర్తి, అక్టోబర్ 10 : తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ముందుచూపుతో కొత్త జిల్లాలు ఏర్పాటుచేయడం వల్ల ప్రజలకు సేవలు వేగంగా అందుతున్నాయి. పాలన చేరువకావడంతో అభివృద్ధి కూడా అదేస్థాయిలో జరుగుతోంది. అలాగే జిల్లా అవసరాలకు తగ్గట్టుగా అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండేలా సమీకృత కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. అక్కడ అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉన్నందున ప్రజలకు సులభతరంగా మారింది. సమైక్యపాలనలో ప్రజలకు కనీస సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ స్వరాష్ట్రంలో మండలాలు, గ్రామాలు, గిరిజన తండాల్లోనూ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
జనగామ చౌరస్తా, అక్టోబర్ 10 : జనగామ జిల్లా ఆవిర్భావంతో సమీకృత కలెక్టరేట్ వచ్చింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండడంతో ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నాయి. జిల్లాలో ఉద్యోగుల సంఖ్య పెరిగింది, పని ఒత్తిడి తగ్గింది. కార్యాలయాల్లో పెండింగ్ ఫైల్స్ అనే ముచ్చటే లేదు. అధికారులు పూర్తి పారదర్శకంగా ప్రజలకు సేవలందిస్తున్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల రావడం ఈ ప్రాంత విద్యార్థులు, ప్రజల అదృష్టం. జిల్లాను మరింత అభివృద్ధిపథంలో తీసుకెళ్లడానికి, ప్రజలకు మెరుగైన పరిపాలన సేవలు అందించడానికి ఉద్యోగులు నిరంతరం కృషి చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో జిల్లా పరుగులు పెడుతోంది.
ములుగు, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రాంతంపై సీఎం కేసీఆర్కు పూర్తి అవగాహన ఉంది. దూరదృష్టితో చిన్న జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయి. జిల్లాకేంద్రంతో పాటు మండలకేంద్రాల్లో భూముల విలువలు పెరిగి ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో అనేక మార్పులు వచ్చాయి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు జిల్లాస్థాయి అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారు. గతంలో ప్రజలు పనుల కోసం కలెక్టరేట్కు వెళ్లాలంటే 200 నుంచి 250 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడు అది 60 నుంచి 70 కి.మీ.కు తగ్గడం వల్ల రవాణాతో పాటు ఆర్థిక ఇబ్బందులు తప్పాయి
ఖానాపురం, అక్టోబర్ 10 : కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన ప్రజలకు చేరువైంది. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మండలాలు, గ్రామాలకు కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు చాలా అరుదుగా వచ్చేవారు. సమస్యలు పరిష్కారం కావడానికి చాలా సమయం పట్టేది. కానీ కొత్త జిల్లాల ఏర్పాటు కావడం వల్ల జిల్లాలోని అన్ని గ్రామాలపై అధికారుల పర్యవేక్షణ పెరిగింది. ప్రభుత్వ పథకాల అమలుపై నిశితంగా పరిశీలిస్తున్నారు. దీని వల్ల ప్రతి లబ్ధిదారుకు సకాలంలో ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. అంతేగాక సమస్యల గుర్తింపు, పరిష్కారం త్వరితగతిన అవుతున్నది. కొత్త జిల్లాలతో ప్రజలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు దక్కుతున్నాయి. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తీసుకున్న ఈ నిర్ణయం రాష్ర్టాభివృద్థికి బాటలు వేస్తున్నది.
రాయపర్తి, అక్టోబర్ 10 : రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు సకాలంలో మెరుగైన సేవలను అందించగలుగుతున్నాం. గతంలో సుమారు 50-70 మండలాలతో ఒక్క జిల్లా ఉండడం, ఒక జిల్లాకు ఒకే కలెక్టర్, ఒకే జాయింట్ కలెక్టర్ విధులు నిర్వర్తించేవారు. కలెక్టర్, జేసీలను కలిసేందుకు మండల స్థాయి అధికారులకే సాధ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. 14-16 మండలాలతోనే జిల్లాలు ఏర్పాటుచేయడం, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో ప్రభుత్వ అధికారులు నిత్యం ప్రజల ముంగిట కన్పిస్తున్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగానికి పరిపాలనతోపాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు పర్యవేక్షణ సైతం సులభమవుతున్నది. ప్రభుత్వం తీసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం అన్ని వర్గాలకు మేలు చేస్తున్నది.