ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టంతో కూడుకున్నదే. పట్టుదలతో పాటు కష్టాన్ని ఇష్టంగా మలుచుకుంటే అదే మీకు ఉద్యోగ మార్గం చూపిస్తుందని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య.. యువతకు ఉద్బోధించారు. ప్రస్తుతం ఉద్యోగార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్న వేళ ఆయన తన అనుభవాలను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకుంటూనే ఉద్యోగార్థులకు కొన్ని సూచనలు చేశారు.
‘ఎన్ని గంటలు ఎన్ని పేజీలు చదివామన్నది కాదు.. చదివింది గుర్తుండేలా చదవాలి.. ఆలోచిస్తూ ఏకాగ్రతతో చదివితే సబ్జెక్ట్ అదే వస్తుంది. స్మార్ట్గా ప్రిపేరవ్వండి.. మీ గురి లక్ష్యం వైపే ఉండాలి. అంతకుముందు నాకు ఉద్యోగం వస్తుందని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ఐఏఎస్ కావాలని లక్ష్యం పెట్టుకొని దానిపైనే ఫోకస్ పెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ రావడం వల్లే ఇవ్వాల కలెక్టర్ అయ్యాన’న్నారు. ఇప్పుడు కష్టపడితే భవిష్యత్తు అంతా బంగారుమయం అవుతుందంటూ ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు.
– ములుగు, మే 25 (నమస్తే తెలంగాణ)
రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్న తరుణంలో ఇప్పుడు నిరుద్యోగులందరి దృష్టి సర్కారీ కొలువుపై ఉంది. ఇప్పటికే రెండు నోటిఫికేషన్లు ఇవ్వడంతో ఎలాగైనా జాబ్ కొట్టాలని యువత పుస్తకాలతో కుస్తీ పడుతోంది. అయితే హార్డ్వర్క్తో చదవకుండా స్మార్ట్గా చదివితే అదే మీకు ఉద్యోగ మార్గం చూపిస్తుందని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగ సాధనలో ఎదుర్కొన్న అనుభవాల ను బుధవారం ‘నమస్తేతెలంగాణ’తో పంచుకున్నారు.
పోటీ పరీక్షల్లో మూడు సూత్రాలను పాటించాలి. 1. ప్రతి పోటీ పరీక్షలో ప్రశ్నలను ఎలా అడుగుతున్నారు..? 2. పోటీ పరీక్షల్లో ప్రశ్నలను ఎలా అడగబోతున్నారు..? 3. మనం రాసేది తప్పా.. ఒప్పా..? సరిచూసుకోవాలి. ఈ మూడు సూత్రాలను పాటిస్తూ రివిజన్ చేస్తూ ఏ పాయింట్స్ రాస్తే విజయం సాధిస్తామో అవగాహన ఏర్పర్చుకోవాలి. ఒకే సమయంలో అన్ని పరీక్షలు రాసినట్లయితే ఉద్యోగం పొందడం సులభమవుతుంది. చదువు అంటే కేవలం పుస్తకం ముందు ఉన్నప్పుడే కాకుండా నిరంతరం టాపిక్లను గుర్తుంచుకోవాలి.
తరగతి గదుల నుంచి బయటకు వెళ్లగానే ఆ రోజు విన్న అంశాల్లోని 10 పాయింట్లను గుర్తుంచుకుంటే పరీక్షలపై అవగాహన వస్తుంది. నాకు కచ్చితంగా ఉద్యోగం వస్తుందని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఉద్యోగం తప్పక వస్తుంది. సివిల్స్ అంటే 80 శాతం ఎఫర్ట్. 20 శాతం లక్ ఉండాలి. నేను మూడు సార్లు గ్రూప్స్ రాసి మూడింటిలో ఎంపికయ్యాను. 16 నుంచి 20 గంటలు చదవాల్సిన అవసరం లేదు. చదివిన గంట, రెండు గంటలైని ఆలోచిస్తూ చదివితే సబ్జెక్టు అదే వస్తుంది. హార్డ్వర్క్తో కాకుండా స్మార్ట్వర్క్తో పోటీ పరీక్షలను ఎదుర్కొంటే ఉద్యోగం పొందడం సులభం అవుతుంది.
నేను ఐఏఎస్ అధికారిగా కావాలనే లక్ష్యంగా పెట్టుకొనే దానిపైనే ఫోకస్ పెట్టాను. కష్టాలను ఓర్చుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను. అలా రావడం వల్ల ఈరోజు నేను జిల్లా కలెక్టర్ హోదాలో ప్రజలకు సేవలను అందించగలుగుతున్నా. ఈ వృత్తి నాకు ఎంతో గర్వకారణం. యువత కూడా మధ్యలో వచ్చే సమస్యలు, ఇబ్బందులను అధిగమించాలి. కేవలం ఒక సంవత్సరం కష్టపడితే చాలు. పరీక్షలకు సిద్ధమైనట్లయితే జీవితం బంగారుమయం అవుతుంది. అయితే ఒక్క పోటీ పరీక్షనే ఎంచుకొని ప్రిపేర్ కావడం కన్నా అన్ని పోటీ పరీక్షలను ఎదుర్కొనే సత్తా మనలో ఉందని నమ్మి పుస్తకాలు చదవాలి. పరీక్షలను మార్కుల కోసమే రాయాలి. పోటీ పరీక్షలు రాసే సమయంలో ప్రశ్నలు ఎలా వస్తాయో గమనించాలి. వాటిని అర్థం చేసుకుంటే మార్కులు అవే వస్తాయి.
నల్లగొండ జిల్లాకేంద్రానికి చెందిన రిటైర్డ్ జూనియర్ లెక్చరర్లు అయిన ఎస్.సుజాత-శంకర్రావు దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కొడుకు కృష్ణచైతన్య, చిన్న కొడుకు కృష్ణ ఆదిత్యలు. వృత్తిరీత్యా ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఈ కలెక్టర్ల తల్లిదండ్రులు తమ పిల్లలను సైతం మంచిమార్గాల వైపు నడిపించి ఐఏఎస్ అధికారులుగా తీర్చిదిద్దారు. 1988 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన మేనమామ రాజేశ్వర్రావును స్ఫూర్తిగా తీసుకొని అమ్మమ్మ రుక్మిణి సహాయ సహకారాలతో అన్నదమ్ములు(కృష్ణ చైతన్య, కృష్ణ ఆదిత్య) ఐఏఎస్ అధికారులుగా స్థిరపడ్డారు.
కృష్ణచైతన్య నాలుగు సార్లు గ్రూప్స్ పరీక్షలు రాసి 2013లో మధ్యప్రదేశ్ క్యాడర్లో ఐఏఎస్ అధికారిగా ఉద్యోగం సాధించారు. చిన్న కుమారుడైన కృష్ణ ఆదిత్య 1 నుంచి 10వ తరగతి వరకు నల్లగొండలోని ఆల్ఫా పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించారు. ఎంపీసీ విభాగంలో శ్రీచైతన్య కాలేజీలో హైదరాబాద్లో ఇంటర్ పూర్తి చేశారు. అనంతరం మాతృశ్రీ ఇంజినీరింగ్ కళాశాలలో 2002 నుంచి 2006 వరకు సీఎస్సీలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. 2006 నుంచి 2008 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తిచేసి నాలుగేళ్ల పాటు ట్రినిటీ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగం చేశారు.
ఇంతటితో సరిపెట్టుకోకుండా అన్నదమ్ములిద్దరు ఢిల్లీలోని మేనమామ రాజేశ్వర్రావు ఇంట్లో అమ్మమ్మ రుక్మిణితో కలిసి ఉంటూ గ్రూప్ పరీక్షలకు శిక్షణ పొందారు. 2012లో గ్రూప్స్ పరీక్షలు రాసిన కృష్ణ ఆదిత్య మెయిన్స్లో 2వ ర్యాంక్, ఇంటర్వ్యూలో 7వ ర్యాంకును సాధించారు. మొదట డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికై 12 నెలల పాటు పోలీస్ ట్రైనింగ్ను పూర్తిచేశారు. అనంతరం 2014లో తెలంగాణ రాష్ట్ర క్యాడర్లో ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు.
మొదటి పోస్టింగ్లో మెదక్ అసిస్టెంట్ కలెక్టర్గా, నారాయణపేట సబ్ కలెక్టర్గా, మహబూబ్నగర్ జాయింట్ కలెక్టర్గా, ఉట్నూర్ ఐటీడీఏ పీఓగా విధులు నిర్వహించి ప్రస్తుతం ములుగు జిల్లా కలెక్టర్గా ప్రజలకు ఆదర్శవంతమైన సేవలను కృష్ణ ఆదిత్య అందిస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కాగా, ఐఏఎస్ పరీక్షలు రాసే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన పుష్పతో కృష్ణ ఆదిత్యకు పరిచయం ఏర్పడి రెండు కుటుంబాల అంగీకారంతో వివాహం జరిగింది. కాగా, సార్ కలెక్టర్ అయితే మేడం ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్లో అదనపు డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి కుమారుడు అశ్రిత్, కుమార్తె ఆద్య ఉన్నారు.