రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నది. పెట్టుబడి సాయం అందివ్వడం మొదలుకుని పంట ఉత్పత్తులను కొనేవరకు వారికి అండగా నిలుస్తున్నది. అలాగే, వానకాలం సీజన్ ప్రారంభం కానుండడంతో అధికారులు విత్తనాలపై దృష్టి సారించాలని ఆదేశించింది.
కలెక్టర్ గోపి విత్తన చట్టంపై 13న విత్తన కంపెనీల ప్రతినిధులు, సీడ్ డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈక్రమంలో అధికారులు మార్కెట్లో జరుగుతున్న విత్తన అమ్మకాలపై నిఘా పెట్టారు. ప్రభుత్వ అనుమతి లేని, నాసిరకం, నకిలీ విత్తనాల విక్రయాలను అడ్డుకునేందుకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశారు. బుధవారం జిల్లాలో ఎనభైకిపైగా విత్తన దుకాణాల్లో తనిఖీలు జరిపారు. విత్తన నిల్వలు, రికార్డులు, లైసెన్సులు, గోదాములను పరిశీలించారు. ఓ షాపులో గడువు ముగిసిన మక్కజొన్న విత్తన నిల్వలను గుర్తించి సీజ్ చేశారు. షాపు యజమానిపై కేసు నమోదు చేశారు.
వరంగల్, మే 25(నమస్తేతెలంగాణ) : రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వానకాలం, యాసంగి సీజన్లలో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులోకి తెస్తున్నది. మార్కెట్లో నాణ్యమైన విత్తనాల విక్రయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నది. అనుమతి లేని, నాసిరకం, నకిలీ విత్తనాల అమ్మకందారులపై ఉక్కుపాదం మోపుతున్నది. ఈ నేపథ్యంలో త్వరలో వానాకాలం సీజన్ ఆరంభం కానున్న దరిమిలా మార్కెట్లో నకిలీ విత్తనాల విక్రయం జరుగకుండా చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులతో ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేయాలని, విత్తన దుకాణాలు, గోదాముల్లో తనిఖీలు నిర్వహించాలని ఇటీవల అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ క్రమంలో కలెక్టర్ గోపి విత్తన చట్టంపై 13న విత్తన కంపెనీల ప్రతినిధులు, సీడ్ డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లతో అవగాహన సదస్సు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని విత్తన దుకాణాల్లో తనిఖీలు జరుగుతాయని చెప్పారు.
వ్యవసాయ, పోలీసుశాఖ అధికారులూ ఈ సమావేశానికి హాజరయ్యారు. రైతులు గత ఏడాది వానకాలం జిల్లాలో 1.19 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఈ ఏడాది 1.30 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం 2.50 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేశారు. ఇప్పటికే జిల్లా కేంద్రానికి వివిధ కంపెనీల పత్తి విత్తన ప్యాకెట్లు ఆరు లక్షల వరకు వచ్చినట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇతర ప్రాంతాలకు పత్తి విత్తనాలు ఇక్కడి నుంచే సరఫరా కానుండడం, వివిధ పత్తి విత్తన కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు వరంగల్లోనే ఉండడం వల్ల ఆరు లక్షల ప్యాకెట్లు ఇక్కడకు వచ్చాయి.
ఈ విత్తన ప్యాకెట్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విత్తన డీలర్లకు సరఫరా అవుతున్నాయి. వరంగల్ సహా జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట ఇతర మండలాల్లోని విత్తన డీలర్లు తమ షాపుల్లో పత్తి విత్తన ప్యాకెట్లను కొద్దిరోజుల నుంచి విక్రయిస్తున్నారు. ఇంకా కూడా పత్తి విత్తన ప్యాకెట్లు వరంగల్కు రానున్నాయి. తొలకరి పడితే పత్తి విత్తనాల అమ్మకం మరింత ఊపందుకోనుంది. ఈ పరిస్థితుల్లో అధికారులు మార్కెట్లో నాణ్యమైన విత్తనాల విక్రయం మాత్రమే జరిగేలా ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో వ్యవసాయ, పోలీసుశాఖ అధికారులతో టాస్క్ఫోర్స్ టీమ్లను ఏర్పాటు చేశారు.
ప్రత్యేక టీమ్లతో జిల్లాలో తనిఖీలు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. ఆరు టాస్క్ఫోర్స్ టీమ్ల్లోని అధికారులు వేర్వేరుగా బుధవారం వరంగల్లో ఎనభైకిపైగా విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ప్రతి టీమ్లో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు(ఏడీఏ), పోలీసు శాఖ ఇన్స్పెక్టర్, రెండు శాఖల సిబ్బంది ఉన్నారు. ఒక్కో టీమ్ ఆరు నుంచి ఏడు షాపుల్లో తనిఖీలు జరిపింది. వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఉషాదయాళ్తో పాటు ఏడీఏలు, సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్కుమార్, వరంగల్ ఏసీపీ గిరికుమార్, ఇంతెజార్గంజ్ ఇన్స్పెక్టర్ మల్లేశ్ తనిఖీల్లో పాల్గొన్నారు.
అధికారులు ప్రతి షాపులో విత్తన విక్రయాల లైసెన్సు, అమ్మకాలు, నిల్వల రికార్డులు, విత్తన నిల్వలు, దుకాణానికి సంబంధించిన గోదాములను పరిశీలించారు. పలు దుకాణాల్లో విత్తన నిల్వల్లో తేడాలపై డీలర్లతో మాట్లాడి అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. వరంగల్లోని అపర్ణ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపులో గడువు ముగిసిన పదహారు ప్యాకెట్ల మక్కజొన్న విత్తనాలను పట్టుకున్నారు. వీటి విలువ రూ.24 వేలుగా వ్యవసాయశాఖ జిల్లా అధికారి ప్రకటించారు. విత్తనాలను సీజ్ చేసి దుకాణా యజమానిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. కాగా, గడువు ముగిసిన మక్కజొన్న విత్తన నిల్వలు అధికారుల తనిఖీల్లో బయటపడడం కలకలం సృష్టించింది.
ఈ విత్తనాలను డీలరు తన షాపులో ఇతర విత్తనాలతో పాటే నిల్వ చేయడం చర్చనీయాంశమైంది. అధికారుల తనిఖీలు జరుగకుంటే, గడువు ముగిసిన మక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేస్తే పరిస్థితి ఎలా ఉండేదని రైతు సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. వరంగల్లో రాత్రి పొద్దుపోయే వరకు విత్తన దుకాణా ల్లో తనిఖీలు, రికార్డులు, విత్తన నిల్వలు, గోదాముల పరిశీలన కొనసాగింది. టాస్క్ఫోర్స్ పోలీసులు కూడా వ్యవసాయశాఖ అధికారులతో కలిసి వరంగల్, గీసుగొండ మండలం కోనాయిమాకుల, మచ్చాపూర్లోని విత్తన షాపుల్లో తనిఖీలు జరిపారు. వ్యవసాయశాఖ అధికారి అనురాధ, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంతోష్, ఎస్సై ప్రేమానందం, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, నర్సంపేటతో పాటు ఇతర ప్రాంతాల్లోని విత్తన దుకాణాల్లోనూ తనిఖీలు నిర్వహించేందుకు వ్యవసాయ, పోలీసుశాఖ అధికారులు సన్నద్ధవుతున్నారు.
వరంగల్ చౌరస్తా, మే 25 : నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ కేసులు నమోదు చేస్తామని డీసీపీ అశోక్కుమార్ హెచ్చరించారు. బుధవారం వరంగల్ స్టేషన్రోడ్లోని విత్తన షాపుల్లో వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ ఉషాదయాళ్తో కలిసి విస్తృత తనిఖీలు చేశారు. తనిఖీల్లో గడువు ముగిసిన రూ.24వేల విలువైన విత్తనాలను గుర్తించామని అధికారులు తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే షాపు అనుమతులు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో వరంగల్ ఏసీపీ గిరికుమార్, ఇంతెజార్గంజ్, మిల్స్కాలనీ, మట్టెవాడ పోలీసు అధికారులు, వ్యవసాయశాఖ ఏజీడీఏ సురేశ్, కృష్ణ, అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు.
గీసుగొండ : మండలంలోని నందనాయక్తండా గ్రామ పరిధిలోని ధనలక్ష్మి ఏజెన్సీస్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. గోదామ్లో కాలపరిమితి ముగిసిన రూ. 1,03,543 విలువైన పురుగు మందులను గుర్తించినట్లు విజిలెన్స్ అధికారి వినయ్కుమార్ తెలిపారు. వీటిని సీజ్ చేసి మండల వ్యవసాయ శాఖ అధికారికి అప్పగించినట్లు చెప్పారు. టాస్క్ఫోర్స్ పోలీసులు మచ్చాపురంలోని మహాలక్ష్మి విత్తనాలు, పురుగుల మందుల షాపుతో పాటు గీసుగొండలోని పలు షాపులను తనిఖీ చేశారు. ఏవో హరిప్రసాద్బాబు మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఈవో స్రవంతి, రజిత పాల్గొన్నారు.