భూమిలో సేంద్రియ పదార్థాలు పెంచడమే లక్ష్యంఎరువుల ఖర్చుకు కళ్లెం..పత్తి, కంది సాగు పెంచుడు వరిలో వెదజల్లే పద్ధతికి ప్రోత్సాహంపంటలో చల్లే ఎరువుల సద్వినియోగానికి చర్యలుప్రణాళికాబద్ధంగా ముందుకు సాగనున్న అధికారులు
హనుమకొండ సబర్బన్, మే 25 : సాగు విధానాల్లో సమూల మార్పులు తెచ్చే దిశగా రాష్ట్ర వ్యవసాయ శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఈమేరకు రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా పంట దిగుబడి సాధించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన ఐదు ప్రధాన సూత్రాలను అమలుచేసేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇందుకోసం క్లస్టర్ల వారీగా రైతుల జాబితాను సిద్ధం చేస్తూ కసరత్తు ముమ్మరం చేసింది. ఏండ్ల తరబడి రసాయన ఎరువుల వల్ల నిస్సారంగా మారుతున్న భూముల్లో సత్తువ నింపడంతో పాటు అధిక దిగుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో అడుగులు వేస్తోంది.
వరి పంట విషయంలో నాట్లు వేసే కూలీలు రోజురోజుకూ తగ్గిపోతున్నారు. కొత్తగా వ్యవసాయంలోకి వచ్చే మహిళా కూలీలకు నాట్లు వేసే నైపుణ్యం ఉండడం లేదు. దీంతో కూలీ ఖర్చు తడిసి మోపెడవడంతో పాటు సరైన సమయంలో నాట్లు పడక దిగుబడిపై ప్రభావం చూపుతోంది. అందుకోసం మే నెల చివరి వారంలో పడే వానలకే పొలాల్లో వరిని నేరుగా వెదజల్లడం ద్వారా పంటకాలం తగ్గుతుంది. దీని వల్ల 25నుంచి 30శాతం వరకు నీరు ఆదా అవుతుంది. తద్వారా రైతులకు 7నుంచి 8వేల వరకు ఖర్చు తగ్గుతుంది. పంట కాలం కూడా తగ్గుతుంది. దీని కోసం ఏఈవోలు క్లస్టర్లలో 25 మంది రైతులను ఎంపిక చేసుకుని వారికి శిక్షణ ఇచ్చి 50 ఎకరాల్లో సాగు చేయిస్తారు.
ఏండ్ల తరబడి వ్యవసాయ భూముల్లో రైతులు వినియోగిస్తున్న రసాయన ఎరువుల వల్ల భూములన్నీ సారం కోల్పోయి నిర్జీవంగా మారిపోయాయి. ఇందుకోసం భూముల్లో సేంద్రియ పదార్థాలను పెంచే చర్యలకు ఉపక్రమించింది. దీనికి గాను పచ్చిరొట్ట ఎరువులను విరివిగా సాగుచేయిస్తారు. జనుము, పిల్లి పెసర, జీలుగ విత్తనాలను ప్రభుత్వం 65% సబ్సిడీతో రైతులకు అందించనుంది. ఫలితంగా భూముల్లో సారం పెరిగి నీటి వినియోగం మొక్కకు సమర్థవంతంగా అందుతుంది. ఈ చర్య ద్వారా పంటలో రెండు యూరియా బస్తాల వినియోగం తగ్గుతుంది.
భూముల్లో రైతులు పంట దిగుబడులు పెంచుకునే ఆశతో బస్తాలకు బస్తాలు ఎరువులు కుమ్మరిస్తున్నారు. దీంతో పంట దగుబడి సంగతి దేవుడెరుగు గాని చీడపీడలు పంటను పీల్చిపిప్పి చేస్తున్నాయి. దీనికి విరుగుడుగా ఇప్పుడు ఎరువులను క్రమ పద్ధతిలో దఫదఫాలుగా పంట కాలంలో మూడు నుంచి నాలుగు సార్లు చల్లుకున్నట్లయితే ఎరువులు పంటకు అవసరం మేరకు వినియోగమవుతాయి. చీడపీడల ఉద్ధృతి తగ్గుతుంది. ఎరువుల ఖర్చు తగ్గి దిగుబడి పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది.
ఈసారి పత్తికి విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఒక దశలో క్వింటాల్ పత్తి రూ.14 వేలు దాటి పోయింది. అందునా రాష్ట్రంలో పండే పత్తికి అంతర్జాతీయ విపణిలో మంచి డిమాండ్ కూడా ఉంది. దీంతో ప్రతి క్లస్టర్ పరిధిలో పత్తి సాగును పెద్ద ఎత్తున పెంచుతారు. ఇదేకాకుండా పప్పు దినుసులకు సైతం మంచి డిమాండ్ ఏర్పడింది. ఇందులో భాగంగా కంది పంటను సైతం విస్తీర్ణాన్ని పెంచి మంచి దిగుబడులు వచ్చేలా చూస్తారు. మొత్తానికి రైతులు రెండు పంటలు వేసుకునేలా ప్రణాళికాబద్ధంగా ముందుకువెళ్తారు.
పలు రకాల పంటల సాగులో ఎరువుల పాత్ర చాలా ముఖ్యం. పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడులు రావాలంటే ఎరువుల వినియోగం తప్పనిసరి. ఇందులో ముఖ్యంగా భాస్వరం చేసే పని అంతాఇంతా కాదు. డీఏపీతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువుల వల్ల భాస్వరం భూమిలోకి చేరుతుంది. అయితే పూర్తిస్థాయిలో భాస్వరాన్ని పంటలు వినియోగించుకోకపోవడం వల్ల దీని నిక్షేపాలు భూముల్లోనే నిల్వ ఉంటున్నాయి. ఈ భాస్వరాన్ని పూర్తిస్థాయిలో మొక్కలకు అందించేందుకు గాను ఫాస్పరస్ సాల్యుబులైసింగ్ బ్యాక్టీరియా(పీఎస్బీ)ని విత్తనశుద్ధిగా గానీ, నేరుగా భూమిలో చల్లడం గానీ చేయిస్తారు. దీంతో ఎరువులు పూర్తిస్థాయిలో పంటలకు వినియోగమవుతాయి. ఏపుగా, ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులను ఇస్తాయి. దీంతో భూమిలో నిల్వ ఉన్న భాస్వరం కరిగి పోవడంతో పాటు రైతులకు ప్రయోజనకరం చేకూరుతుంది. ఇలా పంచసూత్రాలను అమలుచేయడం వల్ల రైతులకు ఖర్చు తగ్గించి దిగుబడులను పెంచాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం ఏఈవోలకు శిక్షణ కూడా ఇప్పటికే పూర్తిచేశారు. ఇక రైతుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించనున్నారు.
రైతులకు పెట్టుబడి తగ్గించి దిగుబడి పెంచడమే ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ఐదు ప్రణాళికలను అమలుచేసేందుకు శ్రీకారం చుట్టాం. భూముల్లో పేరుకుపోయిన భాస్వరం నిల్వలను కరిగిస్తే నేలలు సారవంతమవుతాయి. అలాగే రసాయన ఎరువులు ఎన్ని వేసినా పచ్చిరొట్ట ఎరువులను మించదు. అందుకే పంట పొలాల్లో పచ్చిరొట్ట వేయిస్తున్నాం.
– కేతిడి దామోదర్రెడ్డి, ఏడీఏ