పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వరంగల్ ఎంజీఎం, కేసీఎంలోని పీఎంఎస్ఎస్వై దవాఖానల్లో అత్యాధునిక వైద్య పరికరాలను సమకూరుస్తోంది. ఎంజీఎం వైద్యశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన కంప్యూటెడ్ టెమోగ్రఫీ(సీటీ) స్కాన్ యంత్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మంగళవారం ప్రారంభించడంతో ఉచిత సేవలు అందుబాటులోకి వచ్చాయి.
సంక్లిష్టమైన వైద్య సమస్యలకు చికిత్స అందించే విషయంలో ఈ పరికరం కీలకంగా పని చేస్తుంది. శరీరంలోని కీలక అవయవాలు, భాగాల పనితీరును కచ్చితంగా చెబుతుంది. ఈ రిపోర్టుతోనే సరైన వైద్యం అందించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నగరంలోని రెండు పెద్ద దవాఖానల్లో సీటీ స్కాన్ వసతి ఉండడంతో పేదలకు మేలు జరుగుతోంది. అదేవిధంగా మరో రూ.17 కోట్లతో ఆధునిక మ్యాగ్నెటిక్ రిజిలెన్స్ ఇమేజ్ (ఎంఆర్ఐ) స్కాన్ యంత్రాన్ని ఎంజీఎం దవాఖానకు తెచ్చేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు చేస్తున్నది.
వరంగల్, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎంజీఎం, కేసీఎంలోని పీఎంఎస్ఎస్వై దవాఖానల్లో అత్యాధునిక కంప్యూటెడ్ టెమోగ్రఫీ (సీటీ) స్కాన్ యంత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రైవేట్ దవాఖానల్లో వేల రూపాయలు అయ్యే ఖర్చు తప్పుతున్నది. ఎంజీఎంలో సీటీ స్కాన్ పాతది కావడంతో అదిపని చేయకుండాపోయింది. పలుసార్లు మరమ్మతు చేసినా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం వెంటనే దీని స్థానంలో కొత్త సీటీ స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేసింది.
మంత్రి ఎర్రబెల్లి, చీఫ్విప్ వినయ్భాస్కర్ మంగళవారం ప్రారంభించారు. ప్రతి రోజుల వందల మందికి పరీక్షలు చేసేలా ఇప్పుడు ఎంజీఎంలో వసతులు కల్పించారు. సీటీ స్కాన్ కీలకంగా పని చేస్తుంది. శరీరంలోని కీలక అవయవాలు, భాగాల పనితీరును ఈ యంత్రం కచ్చితంగా చెబుతుంది. సీటీ స్కాన్ రిపోర్టుతోనే సరైన వైద్యం అందించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వరంగల్ నగరంలోని రెండు పెద్ద దవాఖానల్లో సీటీ స్కాన్ వసతి ఉండడంతో పేదలకు మేలు జరుగుతున్నది.
ప్రమాదాల్లో గాయాలైనప్పుడు, శరీరంలోని ఎముకలు, మాంసం, కండరాలు తదితర అవయవాలపై పడిన ప్రభావం, తీవ్రతను గుర్తించి, అంతర్గత రక్తస్రావం జరిగిన విషయాన్ని గుర్తించి వైద్యసేవలు అందించాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే గాయపడిన వారి ప్రాణాలను కాపాడడం సులభమవుతుంది. గాయాలైన వారి ఆరోగ్య పరిస్థితిని కచ్చితంగా అంచనా వేసేందుకు సీటీ స్కాన్ యంత్రాలను ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటు చేసే విషయంలో ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. 2011లో రూ. కోటిన్నరతో కొనుగోలు చేసిన సీటీ స్కాన్ యంత్రం నిర్వహణను మెడాల్ కంపెనీ నిర్వహించింది.
మెడాల్ సంస్థ ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో ఏర్పాటు చేసిన యంత్రంతో ఏడు సంవత్సరాల కాలం మాత్రమే సీటీ స్కాన్ సేవలను అందించింది. తర్వాత కాంట్రాక్టు పొడిగింపు కోసం తిరకాసు పెట్టి పేదలను ఇబ్బందులకు గురి చేసింది. కాంట్రాక్టు పద్ధతిలో అయితే పేదలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందవనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి స్వస్తి పలికింది. పూర్తిగా ప్రభుత్వ దవాఖాన ఆధ్వర్యంలోనే నిర్వహించేలా కొత్త సీటీ స్కాన్ యంత్రాలను కొనుగోలు చేసి అప్పగించింది.
రూ. 2.14 కోట్లతో కొత్తగా సీటీ స్కాన్ యంత్రాన్ని ఎంజీఎంలోని క్యాజువాలిటీ విభాగంలో ఏర్పాటు చేశారు. సీటీ స్కాన్ యూనిట్ 16 స్లెట్ సామర్థ్యం కలిగి ఉన్నది. పీఎంఎస్ఎస్వై దవాఖానలోనూ 126 ైస్లెట్ సామ ర్థ్యం కలిగిన మరో సీటీ స్కాన్ యంత్రాన్నే ఉపయోగిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే ఎంజీఎంలో రూ.1.50 కోట్లతో డిజిటల్ ఎక్స్రే యంత్రాన్ని ఏర్పా టు చేసి పేదలకు సేవలు అందిస్తున్నారు. మరో రూ.17 కోట్లతో ఎంఆర్ఐ స్కాన్ యంత్రాన్ని ఎంజీఎంలో అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. వైద్య సేవలకు అవసరమైన ప్రతి యంత్రం, పరికరం ఎంజీఎంలో ఉండేలా వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళికలు రూపొందించింది.