లింగాలఘనపురం, మే 24 : రాష్ట్ర ప్రభు త్వ ఆదేశాలకనుగుణంగా గ్రామాల్లో క్రీడాప్రాంగణాలకు స్థలాలను గుర్తించి పనులు చేపట్టాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. లింగాలఘనపురం, నెల్లుట్లలో ఏర్పాటు చేస్తున్న్ల గ్రామీణ క్రీడా ప్రాంగణాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అబ్దుల్హమీద్ మాట్లాడుతూ గ్రామాల్లో ఎకరం నుంచి రెండెకరాల ప్రభుత్వ భూములను తహసీల్దార్ గుర్తించి గ్రామపంచాయతీలకు అప్పగించాలన్నారు.
భూములను చదును చేసి, ఫుట్బాల్, వాలీబాల్, బాల్బ్యాడ్మింటన్, కబడ్డీ , ఖోఖో కోర్టులుగా మార్చాలని ఆయన సూచించారు. లింగాలఘనపురంలో సర్వే నంబరు 937లో ఎకరం భూమిని క్రీడా ప్రాంగణానికి కేటాయించామని ఆయన తెలిపారు. వచ్చే జూన్ 2 వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో క్రీడాప్రాంగణాలు పూర్తి కావాలన్నారు. ప్రభుత్వభూములను గ్రామ పంచాయితీలకు క్రీడా ప్రాంగణాల కోసం వెంటనే అప్పగించాలని తహసీల్దార్ అంజయ్యను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో సీతారాంనాయుడు, ఎంపీవో మల్లికార్జున్, ఈసీ వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ కేమిడి కవితావెంకటేశ్, కార్యదర్శి ప్రవీణ్కుమార్, కారోబార్ సురేశ్కుమార్ పాల్గొన్నారు. నెల్లుట్లలో అదనపు కలెక్టర్తోపాటు సర్పంచ్ చిట్ల స్వరూపారాణి భూపాల్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, కారోబార్ కృష్ణస్వామి పాల్గొన్నారు.
బచ్చన్నపేట : మండలంలోని అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల కోసం స్థలాలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని జడ్పీ సీఈవో విజయలక్ష్మి సూచించారు. సోమవారం మండలంలోని లక్ష్మాపూర్లో క్రీడా ప్రాంగణం కోసం స్థలాన్ని ఎంపీడీవో రఘురామకృష్ణతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత యువజనులు, విద్యార్థుల కోసం ఆట స్థలాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు. వారు క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నదని ఆమె వివరించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నవ్యానర్సిరెడ్డి, ఇన్చార్జి ఈసీ, పంచాయతీ కార్యదర్శి సంతోష్ పాల్గొన్నారు.