డోర్నకల్, మే 24: గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ యోగేశ్గౌతమ్ హెచ్చరించారు. మంగళవారం గొల్లచర్ల, కస్నాతండా, లింబ్యా తండా, లచ్యాతండా, చింతల తండాల్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్సైలు, 10మంది ఏఎస్సైలు/హెచ్సీ, 15 మంది కానిస్టేబుళ్లు, 20 మంది స్పెషల్ పోలీసులు, మొత్తం 45మంది సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రూ. 1.5లక్షల విలువైన మద్యం, సరైన పత్రాలు లేని 20 బైక్లు, 3ఆటోలు, రూ.25 వేల విలువచేసే గుట్కా ప్యాకెట్లు, 20 లీటర్ల గుడుంబా, క్వింటా నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. గుడుంబా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. పెద్దల సమక్షంలో సమావేశం నిర్వహించి, గుడుంబా, గుట్కా, గంజాయి, మద్యాన్ని తరిమి కొట్టాలన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత కోచింగ్ను వినియోగించుకుని, కొలువులు సాధించాలన్నారు.
జూన్ 4న జిల్లా కేంద్రంలో ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని డీఎస్పీ సదయ్య అన్నారు. సుమారు 100 కంపెనీలు వస్తున్నాయని, విద్యార్హతను బట్టి ఉద్యోగం, రూ.12 వేల నుంచి రూ.70వేల వరకు వేతనం ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు ఇస్లావత్ శ్రీనివాస్, బాలాజీ, ఎస్సైలు వాంకుడోత్ భద్రూనాయక్, పిట్ట శ్యామ్సుందర్, రమాదేవి, వెంకన్న, ఏఎస్సై రవీందర్, కానిస్టేబళ్లు సైదులు, దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు.