నర్సంపేట, మే 24 : బీటెక్ చదివి చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఈస్ ్టజోన్ డీసీపీ వెంకటలక్ష్మి మంగళవారం నిందితుడి అరెస్టు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా కొత్త వలస మండలం సుందరయ్యపేటకు చెందిన మేకల బాలరాజు బీటెక్ చదివాడు. జల్సాలకు అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించానే ఆలోచనతో విజయనగరంలో పలుచోట్లు చోరీలకు పాల్పడ్డాడు.
ఫిబ్రవరిలో నర్సంపేట ప్రాంతానికి చెందిన వృద్ధుడు కరిమిండ్ల సంపత్రావు లక్ష రూపాయలు బ్యాంకు నుంచి డ్రా చేసుకుని బైక్లో పెట్టగా బాల రాజు చోరీచేశాడు. చోరీ చేసిన డబ్బులను మార్చురీ ప్రాంతాల్లో భద్రపరిచి తిరిగి గ్రామానికి వెళ్లేవాడు. బాధితుడు సంపత్రావు ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు బాలరాజును గుర్తించారు.
మంగళవారం మాదన్నపేట రోడ్డు ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా బాలరాజును అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీ చేసినట్లు అంగీకరించాడు. రహస్యంగా భద్రపరిచిన 1.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రతిభ చాటిన నర్సంపేట ఏసీపీ సంపత్రావు, సీఐ పులి రమేశ్, ఎస్సై రాం చరణ్, సిబ్బందిని డీసీపీ అభినందించారు.