కమలాపూర్, మే 18 : కాంట్రాక్టర్ల నిర్ల క్ష్యం రైల్వే ప్రయాణికులకు శాపంగా మా రింది. ఉప్పల్ రైల్వే స్టేషన్లో మూడో రైల్వేలైన్ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉందని, నెల రోజులుగా ప్యాసింజర్ రైళ్ల హాల్టింగ్ ఎత్తేశారు. దీంతో ప్రయాణికులు జమ్మికుంట, కాజీపేట, ఎల్లాపూర్ రైల్వే స్టేషన్లకు వెళ్లి రైళ్లు ఎక్కాల్సి వస్తోంది. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా పనులు చేస్తుండడంతో నెల రోజులు దాటినా రైల్వే స్టేషన్లో ప్యాసింజర్ రైళ్లు ఆగడం లేదు. పనులు పూర్తి చేయకుండా వాయిదా వేస్తుండడంతో ప్రయాణికులు స్టేషన్కు వచ్చి వెళ్తున్నారు.
ఉప్పల్ రైల్వే స్టేషన్ నుంచి సింగరేణి ప్రాంతాలైన రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, సిర్పూర్ కాగజ్నగర్, మహారాష్ట్రకు వెళ్లేందుకు ప్రయాణికులు నిత్యం రాకపోకలు కొనసాగిస్తారు. వరంగల్, భూపాలపల్లి, ములుగు, హనుమకొండ జిల్లాలకు చెందిన ప్రయాణికులు ఇక్కడి నుంచి సింగరేణి ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. రైల్వే స్టేషన్లో మూడో లైన్ నిర్మాణ పనులు చేపట్టడం కోసం రెండో నంబర్ ప్లాట్ ఫాంను తొలగించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జికి ఇరువైపులా రైల్వేలైన్ నిర్మాణం చేపట్టి, మెయిన్లైన్కు లింక్ కలుపడం వదిలేశారు. సకాలంలో ప్లాట్ఫాం నిర్మాణ పనులు చేయకుండా కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్, కాగజ్నగర్ ఎక్స్ప్రెస్, భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, సింగరేణి, రామగిరి ప్యాసింజర్ రైళ్లు ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఎక్కేందుకు, దిగేందుకు టికెట్ ఇవ్వడం బంద్ చేశారు. కాజీపేట, సికింద్రబాద్ వెళ్లేందుకు డౌన్లైన్లో మాత్రమే రైళ్లు ఆగుతున్నాయి.
రైల్వే స్టేషన్లో పనులు తక్షణమే పూర్తి చేయించి రైళ్ల హాల్టింగ్ చేపట్టాలి. పెండ్లిళ్ల సీజన్ కావడంతో రైలులో ప్రయాణం చేసేందుకు భూపాలపల్లి, పరకాల ప్రాంతా ల నుంచి ఉప్పల్కు ప్రయాణికులు వస్తున్నారు. రైళ్లు ఆగడం లేదని చెప్పడంతో జమ్మికుంటకు వెళ్లి రైలు ఎక్కుతున్నారు. పనులు పూర్తి చేసి ప్రయాణికుల ఇబ్బందులను పరిష్కరించాలి.
– కొండ రమేశ్, ఉప్పల్
రైల్వే స్టేషన్లో పనులు పూర్తి చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్యాసింజర్ రైళ్ల హాల్టింగ్ ఎత్తేయడంతో ప్రయాణికులు పక్క రైల్వే స్టేషన్కు వెళ్లి రైళ్లు ఎక్కుతున్నారు. కాంట్రాక్టర్లు పనులు చేయకుండా వాయిదా వేస్తుండడంతో రైళ్లు ఆగడం లేదు. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే పూర్తి చేయించాలి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రయాణికులకే కాకుండా గ్రానైట్ రాయి ఎగుమతికి ఇబ్బందిగా మారింది. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి.
– ర్యాకం సుధాకర్, ఉప్పల్