వరంగల్, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం సీజన్ దగ్గరికి వస్తున్నది. రైతులకు అవసరమైన అన్నింటినీ సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. రైతు బంధు రూపంలో ఇచ్చే పెట్టుబడితోపాటు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ఇతర అన్ని రకాల ఉపకరణాలను సిద్ధం చేసింది. రైతులకు తీవ్ర నష్టం కలిగించే కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతున్నది. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా పంటలు సాగు చేసే విస్తీర్ణాన్ని లెక్కగట్టింది. దీనికి అనుగుణంగా ఎరువులు, విత్తనాలను సిద్ధం చేస్తున్నది. రైతులకు ఎక్కువ లాభం ఉండే పత్తి, మొక్కజొన్న, కంది వంటి పంటల సాగు పెంచేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపడుతున్నది.
వరిలోనూ తక్కువ పెట్టుబడి ఉండేలా వెదజల్లే విధానంతో ఎక్కువ ఎకరాల్లో సాగు చేసేలా జిల్లా వారీగా లక్ష్యాలను రూపొందించింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ జిల్లాల్లో గత ఏడాది కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరుగనుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అన్ని జిల్లాల్లోనూ వానకాలం పంటల విస్తీర్ణం పెరిగే పరిస్థితి ఉన్నది. వ్యవసాయ శాఖ దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. హనుమకొండ జిల్లాలో 2,40,000 ఎకరాల్లో పంటల సాగుతోపాటు 91,350 టన్నుల ఎరువులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.
అన్నదాతలకు అన్ని రకాలుగా ఉండేలా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. రైతుల వారీగా పంటల సాగుపై కచ్చితమైన లెక్కలు ఉండేలా వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సర్వే నంబర్ల వారీగా సాగు చేసే పంటల వివరాలను నమోదు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పంటల సాగు వివరాల ఆధారంగా అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర పెట్టుబడి ఉపకరణాలను అందించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. వరి సాగును తగ్గించి తక్కువ పెట్టుబడితో రైతులకు ఎక్కువ లాభం వచ్చే పత్తి, మొక్కజొన్న, కంది, పసుపు, మిరప, వేరుశనగ పంటల సాగును పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
వ్యవసాయ పంటలతోపాటు ఉద్యాన పంటల సాగును పెంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఆయిల్పామ్ సాగు కోసం జిల్లాల వారీగా ప్రణాళిక తయారు చేసినట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లాలో 40 వేలు, హనుమకొండ జిల్లాలో 20 వేల ఎకరాల్లో కొత్తగా ఆయిల్పామ్ సాగు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పంటల సాగుకు అనుగుణంగా భూముల్లో సారం పెంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
జనుము, జీలుగ విత్తనాలను సబ్సిడీపై రైతులకు సరఫరా చేస్తున్నది. ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి రైతులకు జనుము, జీలుగ విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నది. రసాయన ఎరువుల వినియోగం తగ్గించేందుకు వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కల్పిస్తున్నది. సంప్రదాయ ఎరువులతోనే భూసారం పెరుగుతుందని, రసాయన ఎరువులతో వచ్చే ప్రతికూలతలను వ్యవసాయ అధికారులు రైతులకు వివరిస్తున్నారు. జనముగు, జీలుగ విత్తనాలు సాగు చేసిన రైతుల పొలాలను మిగిలిన వారికీ చూపించి దీనిపై అవగాహన పెంచుతున్నారు.
జిల్లా టన్నులు
వరంగల్ 1,34,500
హనుమకొండ 91,350
మహబూబాబాద్ 1,38,177
జయశంకర్ భూపాలపల్లి 63,720
ములుగు 44,720
జనగామ 1,11,077