తప్పుడు ఆధార్, అడ్రస్లు పెట్టి కొందరు అక్రమార్కులు రూ.30లక్షల బ్యాంకు రుణాలు తీసుకొని ఎగ్గొట్టారు. తీరా బ్యాంకు నుంచి పలువురు స్వయం సహాయక సంఘాల మహిళలకు లోన్లు కట్టాలని నోటీసులు రావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. తాము రుణాలు తీసుకోనేలేదని, ఎవరో తమ ఆధార్, అడ్రస్లను వాడుకొని లోన్లు తీసుకున్నారని పోలీస్ స్టేషన్కు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో వెలుగుచూసిన ఈ ఘటన కుమార్పల్లి, రాయపుర, ఇందిరానగర్, సుధానగర్, టైలర్స్ట్రీట్ కాలనీల్లో చర్చనీయాంశమైంది.
సుబేదారి, మే 18: కొందరు అక్రమార్కులు ఆరుగురు స్వయం సహాయక మహిళలకు చెందిన ఆధార్, అడ్రస్లతో బ్యాంకు రుణాలు పొందారు. దాదాపు రూ.30లక్షల దాకా లోన్లు తీసుకొని ఎగ్గొట్టారు. తీరా బ్యాంకు నుంచి సదరు అడ్రస్లు కలిగిన మహిళలకు నోటీసులు రావడంతో వారు లబోదిబోమంటున్నారు. హనుమకొండ జిల్లా కే్రందంలోని కుమార్పల్లి, రాయపుర, ఇందిరానగర్, సుధానగర్, టైలర్స్ట్రీట్ కాలనీలకు చెందిన ఆరుగురు స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆధార్, అడ్రస్తో హంటర్రోడ్డులోని ఇండియన్ బ్యాంకులో కొందరు అక్రమార్కులు ఆరుగురి పేరు మీద రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.30లక్షల రుణం తీసుకున్నారు.
చాలాకాలంగా బ్యాంకు రుణం తిరిగి చెల్లించడం లేదని, వడ్డీతో కలిపి మొత్తం ఒక్కొక్కరు రూ.8.23లక్షల చొప్పున (ఆరుగురు మొత్తం రూ.49.38లక్షలు) చెల్లించాలంటూ కొద్ది రోజుల క్రితం వారి అడ్రస్లకు నోటీసులు వచ్చాయి. వారంలోగా చెల్లించకుంటే బ్యాంకు లోను అగ్రిమెంట్ ప్రకారం ఆస్తులను జప్తు చేస్తామని పేర్కొంటూ బ్యాంకు అధికారులు సదరు మహిళలకు లీగల్ నోటీస్లు పంపారు.
దీంతో బాధిత మహిళలు ఇండియన్ బ్యాంకుకు వెళ్లి అధికారులను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. తాము రుణాలు తీసుకోలేదని వాపోయారు. ఆధార్, అడ్రస్ మాత్రమే తమదని, సంఘం పేరు, ఇతర వివరాలు తమవి కావని కన్నీరు మున్నీరయ్యారు. రెండు రోజుల క్రితం బాధిత మహిళలు హనుమకొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.