‘పల్లె ప్రగతి’తో చలపర్తి ముఖచిత్రమే మారింది. ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోని ఈ పల్లె.. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ప్రజాప్రతినిధుల ప్రత్యేక శ్రద్ధతో కొత్తరూపు సంతరించుకుంది. అద్దంలా మెరిసే రోడ్లు, ఆహ్లాదం పంచే పల్లె ప్రకృతి వనం, హరితహారం మొక్కలతో పచ్చని వాతావరణం, వ్యాయామానికి అనువుగా తీర్చిదిద్దిన పంచతత్వ పార్కు, జిగేల్మనే స్ట్రీట్లైట్లు, చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా కనిపించే వీధులు.. అలాగే డంపింగ్ యార్డు, వైకుంఠధామం అందుబాటులోకి వచ్చాయి. ఇలా సమర్థవంతంగా పల్లె ప్రగతి పనులు పూర్తి చేసినందుకు గాను ఉత్తమ జీపీ అవార్డును సొంతం చేసుకొని దుగ్గొండి మండలంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచింది.
– దుగ్గొండి, మే 18
పల్లెప్రగతితో చలపర్తి గ్రామం సరికొత్తగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వినియోగించుకొని ప్రజలు, జీపీ పాలకవర్గం, అధికారుల సమన్వయంతో గ్రామంలో పల్లెపార్కు, డంపింగ్యార్డు, శ్మశానవాటిక, నర్సరీలు వంద శాతం పూర్తయి దుగ్గొండి మండలంలోనే మొదటిస్థానంలో నిలిచింది. పల్లె ప్రకృతి వనంలో నడిచేందుకు వీలుగా వాకింగ్ ట్రాక్లు, సేద తీరేందుకు బెంచీలు వేయించారు. అలాగే పార్కు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు.
ఈ పార్కు మండలకేంద్రానికి వెళ్లే దారిలో గ్రామానికి సమీపంలోనే ఉండడంతో చూపరులను ఆకట్టుకుంటోంది. నిత్యం గ్రామస్తులు పార్కును సందర్శిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రధాన రహదారులతో పాటు అంతర్గత వీధుల్లో సీసీరోడ్ల వెంట కూడా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ట్యాంకర్తో నీళ్లు పడుతూ సంరక్షిస్తున్నారు. జీపీ సిబ్బంది నిత్యం ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తూ ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
గ్రామంలో ప్రతి విద్యుత్ స్తంభానికి ఎల్ఈడీ లైట్లు అమర్చారు. గ్రామంలో ప్రతి ఇంటింటికీ హరితహారంలో భాగంగా పండ్లు, నీడనిచ్చే మొక్కలను అందించేందుకు నర్సరీలో 10వేల మొక్కలను సిద్ధంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. పల్లె ప్రగతి పనులు సకాలంలో సమర్థవంతంగా అమలు కావడంతో చలపర్తి గ్రామం ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. 2020 జనవరి 26న కలెక్టర్ ముండ్రాతి హరిత చేతుల మీదుగా సర్పంచ్ ముదురుకోళ్ల శారద ఉత్తమ జీపీ అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
చలపర్తి గ్రామానికి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు 14వ, 15వ, ఆర్థిక సంఘాల ద్వారా ప్రతి నెలా రూ.లక్షా 80వేల చొప్పున ఏటా రూ.22లక్షలు సమాకూరుతున్నాయి. అంతేగాక గ్రామానికి పన్నుల రూపంలో సంవత్సరానికి రూ.3లక్షల ఆదాయం వస్తున్నది. ఈ నిధుల ద్వారా గ్రామాభివృద్ధికి నిధులు కేటాయిస్తూ మౌలిక వసతులు కల్పిస్తున్నారు. పారిశుధ్య కార్మికులకు, జీపీ సిబ్బందికి నెలనెలా జీతాలు అందిస్తూ నిత్యం పారిశుధ్య పనులు చేస్తున్నారు. తాగునీటి సౌకర్యం కోసం మిషన్ భగీరథ ట్యాంక్ నిర్మించారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం దోమల మందులు, బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తూ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు.
గ్రామ ప్రజల సహకారంతో పల్లె ప్రగతి పనులు సమర్థవంతంగా నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామంలో అన్ని సౌకర్యాలు కల్పించాం. పాలకవర్గం, అధికారుల ప్రత్యేక చొరవతో పంచతత్వ పార్కును నిర్మించాం. ఇదే స్ఫూర్తితో చలపర్తిని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతా.
– ముదురుకోళ్ల శారద, సర్పంచ్, చలపర్తి
గ్రామస్తుల ఆరోగ్యానికి గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్మించిన పంచతత్వ పార్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అప్పటి మండలాభివృద్ధి అధికారి గుంటి పల్లవి ప్రత్యేక చొరవతో నిర్మాణం చేపట్టగా ప్రస్తుత ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్గౌడ్లు పూర్తి చేసి మండలంలోనే ప్రత్యేక పార్కుగా తీర్చిదిద్దారు. గ్రామస్తులకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు పల్లె పార్కుతో పాటు వ్యాయామంలో భాగంగా రక్తప్రసరణ సరిగా జరిగేందుకు ప్రకృతి సిద్ధమైన నడక కోసం పంచతత్వ పార్కును అందుబాటులోకి తెచ్చారు. ఆరోగ్య పరిరక్షణకు గ్రామస్తులు నిత్యం పార్కుకు వచ్చి వాకింగ్ చేస్తున్నారు.
చలపర్తిలో పల్లె ప్రగతి ద్వారా అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో గ్రామంలో ప్రతి వీధిలో సీసీరోడ్డు వేయించాం. నిత్యం చెత్తాచెదారం తొలగించడంతో ఊరు అద్దంలా మెరుస్తోంది. అలాగే అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలంలో డంపింగ్యార్డు, వైకుంఠధామం, పల్లె పకృతి వనాలన్నీ ఒకే చోట నిర్మించాం.
– సంతోష్కుమార్, పంచాయతీ కార్యదర్శి