భీమదేవరపల్లి, మే 18 : చారిత్రక కొత్తకొండ వీరభద్రస్వామి గుట్టపైనే కాదు.. సమీప కొండల్లోనూ అపురూప శిల్ప సంపద దాగి ఉంది. కోనేర్లు, పెద్ద పెద్ద రాళ్లతో ప్రహరీ గోడలు, కోట బురుజులు, తహసీల్ గుండు, శివాలయం, స్వాగత తోరణం ఇలా ఎన్నో ఉన్నాయి. వేలేరు రహదారిలో ఉన్న వద్దిగుట్టపై రాతిగుండుపై శిల్పాలు చెక్కి ఉన్నాయి. దీనికి ముందుభాగాన ఆంజనేయస్వామి విగ్రహం ఉంది.
రాతిగుండుపై కుడివైపున నమ్మళ్వార్, పెరియాళ్వార్, లక్ష్మీసమేత నరసింహస్వామి, కుడివైపున భక్తప్రహ్లాద, హిరణ్యకశిపుడి ప్రతిమలు చెక్కి ఉన్నాయి. రాతిగుండు పక్కన చిన్న గుడి నిర్మించి ఉంది. అందులో రాతిగుండుపై త్రిదండం చేతపట్టుకున్న(పెద్ద ఆళ్వార్) రామానుజ కూటం అస్పష్టంగా కనిపిస్తుంది. రాతిగుండుపై చెక్కిన శిల్పాలు 16వ శతాబ్దం నాటివి అయి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. మొదటి దశలో ఇద్దరు మాత్రమే ఆళ్వార్లు ఉండేవాళ్లు.
తర్వాతి కాలంలో 12 ఆళ్వార్లను ఆలయాల్లో చేర్చబడినట్లు చరిత్ర చెబుతోంది. అయితే ఆళ్వార్లు వైష్ణవాలయల్లో విరివిగా కనిపిస్తారు. అలాగే ఈ గుట్టపై జనసమూహం తాత్కాలికంగా నివాసమున్నట్లు తెలుస్తోంది. గుట్టపైన రోలు, రాతిగొడ్డళ్లు సానపెట్టిన ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి. కొత్తకొండలోని వద్దిగుట్ట ప్రాంతంలో అక్రమంగా మట్టిని తరలించడం, గుట్టపై రాళ్లను కొట్టడం వల్ల చారిత్రక ఆనవాళ్లను దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. చారిత్రక సంపదకు నిలయమైన కొత్తకొండలో వారసత్వ సంపదను సంరక్షించాలని చరిత్రకారులు కోరుతున్నారు.