కృష్ణకాలనీ, ఆగస్టు 20 : క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ క్రీడా మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికల పోటీలకు మున్సిపల్ చైర్ పర్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా 100, 200, 400, 800, 1500 మీటర్ల రన్నింగ్తో పాటు లాంగ్జంప్, హైజంపు, షాట్పుట్, జావెలిన్త్రో క్రీడలను జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి, శారీక దృఢత్వానికి దోహదపడతాయన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలోనూ ప్రతిభ చూపాలని పిలుపునిచ్చారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొక్కూరి చిన్న రాజయ్య, పూతల సమ్మ య్య మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన 30 మంది క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 25, 26వ తేదీల్లో మెదక్ జిల్లా లో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగనున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు జాగరి అజయ్ యాదవ్, కోశాధికారి బెడిక రాజయ్య, తిరుపతి, నాగరాజు పాల్గొన్నారు.