పరకాల, ఆగస్టు 19 : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 110 మంది లబ్ధిదారులకు రూ.44.89 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.
అత్యవసర సమయంలో పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందన్నారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలో నలుగురికి రూ.1.4 లక్షలు, పరకాల మండలంలో ఏడుగురికి రూ.2.43 లక్షలు, నడికూడ మండలంలో 21 మందికి రూ.8.02 లక్షలు, ఆత్మకూరు మండలంలో 12 మందికి రూ.5.82 లక్షలు, దామెర మండలంలో 15 మందికి 5.77 లక్షలు, గీసుకొండ, సంగెం మండలాలతో పాటు 15,16,17డివిజన్లకు చెందిన 51మంది లబ్ధిదారులకు రూ.21.40 లక్షల చెక్కులను అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలకు స్థానం లేదని, త్వరలోనే కాంగ్రెస్, బీజేపీలు కనుమరుగు కానున్నాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దామెర మండల కేంద్రానికి చెందిన పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో శుక్రవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు అందరూ టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు.
పార్టీలో చేరిన వారిలో దామెర గ్రామ వార్డు సభ్యులు పోతుల వీరయ్య, దామెర అనూష సుమన్ ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కాగితాల శంకర్, వైస్ ఎంపీపీ జాకిర్ అలీ, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పోలం కృపాకర్ రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ బిల్లా రమణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామకృష్ణ, దళిత బంధు కమిటీ మండల కన్వీనర్ కృష్ణమూర్తి, నాయకులు గడ్డం సదానందం, బత్తిని చిన్నరాజు, వేల్పుల ప్రసాద్ పాల్గొన్నారు.
దామెర : సీఎం కేసీఆర్ అభివృద్ధి ప్రదాత అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకుంటున్నారన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ కాగితాల శంకర్, సర్పంచ్ శ్రీరాంరెడ్డి, జడ్పీటీసీ కల్పన, వైస్ ఎంపీపీ జాకీర్అలీ, ఎంపీటీసీ పోలం కృపాకర్రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ బిల్లా రమణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గండు రామకృష్ణ, గడ్డం సదానందం, బత్తిని చిన్నరాజు, వేల్పుల ప్రసాద్, తహసీల్దార్ రియాజొద్దీన్, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.
ఆత్మకూరు : కార్యకర్తల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని అగ్రంపహాడ్, అక్కంపేట, పెద్దాపురం గ్రామాల్లో సిలువేరు పోతయ్య, ఇందురి రాజమ్మ, నాగనబోయిన లక్ష్మయ్య మృతి చెందగా వారి కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే వెంట రైతు బంధు సమితి ఆత్మకూరు, దామెర మండలాల కోఆర్డినేటర్లు ఎనకతాళ్ల రవీందర్, బిల్లా రమణారెడ్డి, జడ్పీటీసీ కక్కెర్ల రాధికారాజు, సర్పంచ్లు మాదాసి అన్నపూర్ణారాజు, ఎనకతాళ్ల విజయహంసాల్రెడ్డి, సావురే కమలారాజేశ్వర్రావు, అగ్రంపహాడ్ జాతర కమిటీ చైర్మన్ గుండెబోయిన రాజన్న, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు శీలం సాంబయ్య, కూస కుమారస్వామి, రాయరాకుల రవీందర్( డీఆర్), టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంబటి రాజస్వామి ఉన్నారు.