ఖిలావరంగల్, ఆగస్టు 15 : చారిత్రక ఓరుగల్లు కోటలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు అంబరాన్నంటాయి. ఖిలావరంగల్లోని ఖుష్మహల్ మైదానంలో తొలిసారిగా నిర్వహించిన పంద్రాగస్టు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వేడుకలకు ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్ ఐఈఎస్ జీఆర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం అహింసా మార్గంలో స్వాతంత్య్రాన్ని సాధించిన మహానుభావులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిది నెలల్లోపే నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ను అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని కొనియాడారు. దీని నిర్మాణం ఒక చారిత్రక ఘట్టమన్నారు. అనేక ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణతో తెలంగాణ అన్నపూర్ణగా అవతరించిందన్నారు. హైదరాబాద్లోనే 1500పైగా చిన్న, పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయని, వరంగల్, కరీంనగర్లో కూడా ప్రభుత్వం ఐటీ పరిశ్రమలను తీసుకువచ్చిందన్నారు. దీంతో 6.29 లక్షల మంది ప్రత్యక్షంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు.
సాంస్కృతిక వారసత్వం కలిగిన జిల్లా వరంగల్ అని కొనియాడారు. కాకతీయుల కాలంలో నిర్మితమైన గొలుసు కట్టు చెరువులను సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయతో పునరుద్ధరణ చేశారన్నారు. జిల్లాలో 55,262 ఎకరాల ఆయకట్టుతో 815 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉన్నాయన్నారు. జాతీయ సగటు తలసరి ఆదాయం రూ.1,26,855 కాగా, 2020-21లో వరంగల్ తలసరి ఆదాయం రూ.1,75,951గా అంచనా వేశారన్నారు. జిల్లాలో 645 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే ‘మన ఊరు-మన బడి, మన బస్తీ మన బడి’ అని అన్నారు. మొదటి విడుతలో 223 పాఠశాలల్లో రూ.57.9కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం ద్వారా జిల్లాలో 1,01,956 మందికి ఆసరా పెన్షన్లు మంజూరు చేశామన్నారు. 33,192 వృద్ధాప్య, 2,070 చేనేత, 14,74 దివ్యాంగులు, 2,574 కల్లుగీత, 5,591 బీడీ కార్మికులు, 2,801 ఒంటరి మహిళలు, 41,654 వితంతు పెన్షన్లు ఉన్నాయన్నారు. కొత్తగా జిల్లాలో 29,245 మందికి పింఛన్లు మంజూరు చేశారన్నారు. అలాగే, అంతరించిపోతున్న గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు జిల్లాలో 576 గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిందన్నారు. 127 గ్రామీణ క్రీడా ప్రాంగణాలు మంజూరు కాగా, 23 పూర్తయ్యాయని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో దండుగ అన్న వ్యవసాయాన్ని తెలంగాణలో పండుగలా చేస్తున్నారన్నా రు. రైతు బంధు పథకం ద్వారా 1,45,128 మం ది రైతులకు రూ.133.81 కోట్లు బ్యాంక్ ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం జమచేసిందన్నారు. అలాగే, జిల్లాలో ఇప్పటి వరకు 395 మంది రైతులు చనిపోతే ఒక్కొక్కరికి రూ.5లక్షలు చొప్పున 19.75 కోట్లు అందజేసిందన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 9,231 ఎకరాల్లో పామాయిల్ తోటలు పెంచాలని ప్రభుత్వం నిర్దేశించిందన్నారు. రామ్చరణ్ ఇండస్ట్రీస్ సంగెం మండలం రాంచంద్రాపూర్ గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నదన్నారు. తొలుత 12,006 ఎకరాల్లో సాగుకు 3,086 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు.
కొవిడ్ నుంచి ప్రజలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో మొదటి డోసు 105 శాతం, రెండో డోసు 104.08 శాతం, 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు 98 శాతం, ప్రికాషనరీ డోసు 23 శాతం పూర్తి చేశామన్నారు. 302 గ్రామాల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు కల్యాణలక్ష్మి ద్వారా 25,050 కుటుంబాలకు లబ్ధి చేకూరగా, షాదీముబారక్ ద్వారా 2,936 కుటుంబాలకు ఆర్థికసాయం అందిందన్నారు.
ఖిలావరంగల్లోని ఖుష్మహల్ మైదానంలో జరిగిన స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలలో వివిధ శాఖలకు చెందిన శకటాలు, స్టాళ్లు ఆకట్టుకున్నాయి. డీఆర్డీఏ, ఎస్సీ కార్పొరేషన్, వ్యవసాయ, ఉద్యాన, విద్య, వైద్యారోగ్య, సాంఘిక సంక్షేమ, అటవీ, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేశారు.
నగరంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు జాతీయతా భావం ఉట్టిపడేలా చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అలాగే ఖుష్మహల్లో ఏర్పాటు చేసిన త్రెలుగు స్వాతంత్య్ర సమరయోధుల బయోగ్రఫీ ప్రదర్శన ఆకట్టుకున్నది. తొలిసారి జిల్లాలో జరిగిన పంద్రాగస్టు వేడుకలను వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు.
జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, కలెక్టర్ బీ గోపి, డీసీపీ వెంకటలక్ష్మి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, అదనపు కలెక్టర్లు బీ హరిసింగ్, శ్రీవత్స కోట, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్ బైరబోయిన ఉమ తదితరులు పాల్గొన్నారు.