వరంగల్, ఆగస్టు15 (నమస్తేతెలంగాణ) : సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు సోమవారం నుంచి ఆసరా పథకం ద్వారా కొత్త పింఛన్ల పంపిణీ మొదలైంది. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా తొలిరోజు 672 మందికి ప్రభుత్వం ఆసరా గుర్తింపు కార్డులు అందజేసింది.కృతజ్ఞతగా లబ్ధిదారులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆసరా పథకం నుంచి ప్రభుత్వం కొత్తగా జిల్లాలో 29,245 మందికి పింఛన్లు మంజూరు చేసింది. ఇప్పటికే 1,01,956 మందికి ప్రతి నెలా రూ.22,83,36,784 పింఛన్ల రూపంలో అందజేస్తున్నది.
దివ్యాంగులకు రూ.3,016, ఇతరులకు రూ2,016 చొప్పున ఇస్తున్నది. కాగా, కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభం రోజున జిల్లాలో 672 మంది లబ్దిదారులకు ఆసరా గుర్తింపు కార్డులు, ప్రొసిడింగ్ కాపీలను అందజేశారు. మండలానికో 48 చొప్పున పదకొండు మండలాల్లో 528, జీడబ్ల్యూఎంసీ పరిధిలోని వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లో 144 మంది లబ్దిదారులకు సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పంపిణీ చేశారు.
వర్దన్నపేట, నర్సంపేటలో స్థానిక ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్రెడ్డి, సంగెం, గీసుగొండ మండలాల్లో ఆశాలపల్లి, కొనాయిమాకుల గ్రామాల వద్ద పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆసరా గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఖిలావరంగల్లోని ఖుష్మహల్ మైదానంలోనూ పంపిణీ జరిగింది. నర్సంపేటలో లబ్ధిదారులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
కొత్త పింఛన్లు ఇవ్వడం ఆనందంగా ఉంది. 57 సంవత్సరాలు నిండినోళ్లందరినీ ఆసరా పింఛన్తో ప్రభుత్వం ఆదుకుంటున్నది. సీఎం కేసీఆర్కు ఎంతో రుణపడి ఉన్నా. పింఛన్ డబ్బులతో నెలనెలా అవసరాలను తీర్చుకుంటున్నా. పింఛన్ మంజూరైన లబ్ధిదారుల జాబితాలో నా పేరుండడం సంతోషకరం. ముసలోల్లకు, వికలాంగులకు, వితంతువులకు, ఏ దిక్కూలేని ఒంటరి మహిళలలకు ఆసరా పింఛన్లు చాలా ఉపయోగపడుతున్నాయి. ఎంతో మేలు కలుగుతున్నది.
– మంగమ్మ, అక్కల్చెడ
ఆసరా పింఛన్ ఇచ్చి సీఎం కేసీఆర్ మమ్మల్ని ఆదుకున్నారు. కేసీఆర్కు ఎంతో రుణపడి ఉన్నాం. కేసీఆర్ రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారు. ఆసరా పింఛన్తో అవసరాలను తీర్చుకుంటాను. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో ఏ పని చేయలేక పోతున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆసరా పింఛన్లు ఇస్తున్నారు. ఎంతోమందికి ఆర్థిక భరోసా ఇస్తున్నారు.
– కౌసల్య, రాజ్యతండా