దేవరుప్పుల, ఆగస్టు 9 : తెలంగాణ ప్రాంతంలో మతసామరస్యానికి ప్రతీక మొహర్రం నిలుస్తుందని ఎంపీపీ బస్వ సావిత్రి అన్నారు. సీతారాంపురం గ్రామంలో మొహర్రం పర్వదినం చివరి రోజైన మంగళవారం తల్లి పీరీలను పల్లకీపై ఊరేగింపుగా మోసుకురాగా ఎంపీపీ బస్వ సావిత్రి, స్ధానిక సర్పంచ్ రెడ్డిరాజుల రమేశ్ దట్టీలు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
సర్పంచ్ రమేశ్, మాజీ సర్పంచ్ బస్వ మల్లేష్ తల్లి పరీల పల్లకీని మోసి భక్తి శ్రద్దలను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ యాఖూబ్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు మహ్మద్ యాఖూబ్ పాషా, పరీల ముజవరులు మౌలానా, అఫ్జల్ రజాక్, పాషా, టీఆర్ఎస్ మైర్టీ సెల్ ప్రచార కార్యదర్శి నజీర్మియా, సోనామిమా, పైండ్ల రవి, బోనాల కొండయ్య, తాడెం నర్సయ్య ఉన్నారు.
జఫర్గఢ్ : మండలంలోని ఆయా గ్రామాల్లో మొహర్రం వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం వేడుకలను మండలంలోని కూనూరు, తమ్మడపల్లి(జి), ఒబులాపూర్, జఫర్గఢ్ తదితర గ్రామాల్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా పీరీలను ఎత్తుకుని ఊరేగించారు. మండలంలోని కూనూరు లో మొహర్రం సందర్భంగా ఎమ్మెల్యే టీ రాజయ్య ఆదేశాల మేరకు కూనూరు టీఆర్ఎస్ మండల నాయకుడు చిర్ర చందర్ గౌడ్ డప్పులను మసీదుకు బహూకరించారు. కార్యక్రమంలో ముస్లిం సంఘం అధ్యక్షుడు ఎండీ అజార్ పాష, తాజుద్దీన్, టీఆర్ఎస్ నాయకులు సమ్మయ్య, శ్రీనివాస్, మోడెం కృష్ణ, అశోక్, గ్రామస్తులు పాల్గొన్నారు.
నర్మెట : గ్రామాల్లో హిందూ, ముస్లింలు కలిసి జరుపుకునే పండుగ మొహర్రం. మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో 9 రోజుల పాటు నిర్వహించిన పీరీలను మొహర్రం పండగ రోజు ఊరేగిస్తారు. చివరి రోజు ఆల్వ లు చుట్టూ తిరుగుతూ, వివిధ వేషాధారణలతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఇంటి ముందుకు పీరీలు వెళ్లడంతో భక్తులు కుడుక, బెల్లం, పానుక లాంటి ప్రసాదాలను అందించి మొక్కులను చెల్లించారు.
పాలకుర్తి : మొహర్రం సందడితో గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ గోచరిస్తోంది. మొహర్రం పండుగను పురస్కరించుకుని మంగళవారం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మండల కేంద్రంలోని పురవీధుల్లో బ్యాండ్ బాజా, డప్పు చప్పుళ్లతో భక్తిశ్రద్ధలతో పీరీలను ఊరేగించారు. మండల కేంద్రానికి చెందిన బండి రాజు వేసిన శూర్పనక వేషధారణ ఆకట్టుకున్నది. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
స్టేషన్ ఘన్పూర్ : మండలంలో మంగళవారం మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి. మొహర్రం సందర్భంగా ముస్లీంలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. డప్పుచప్పుళ్లతో పీరీలను ఊరేగించారు. ప్రజలు హిందూ ముస్లీంలు పీరీలకు దస్తీ, కుడుకలు, వెండితో తయారు చేసిన గొడుగు, చాదర్లు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పగూడంలో పీరీలకు ఎస్సై శ్రవణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
లింగాలఘనపురం : మండలంలో మంగళవారం ఘనంగా మొహర్రం వేడుకలు జరుపుకున్నారు. మొహ ర్రం నెల ఆరంభంలో నెలవంక దర్శనంతో పీరీలను మసీదులో నిలబెట్టారు. మండల కేంద్రంలో రజక, గౌడ, పద్మశాలీ, నాయీబ్రాహ్మణ కులస్తులు నెలవంక దర్శనం నుంచి ముస్లిం సంప్రదాయాలను పాటించారు. సోమవారం ఇంటిల్లి పాది ఉపవాస దీక్షలు చేపట్టి, కొత్త కుండలో షర్బత్, మట్కీలు చేసి మంగళవారం పీరీలకు నైవేద్యం ఇచ్చాక దీక్షలను విరమించారు.
చిల్పూరు : మండలంలో మొహర్రం వేడుకల్ని హిందూ ముస్లింలు కలిసి జరుపుకున్నారు. చిన్నపెండ్యాలలో సవార్లను ఇంటింటికీ తిప్పారు. భక్తులు గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మొహరం వేడుకల్ని 9 రోజులు నిర్వహిస్తారు.
అలావా (గుంత) ఏర్పాటు చేసి కట్టెలతో నిప్పు తయారు చేసి ప్రతి రోజు గుండం చుట్టూ తిరుగుతూ అసైదుల్లా హారతి అంటూ ఆడుతు పీరీలను ప్రతిరోజు వీధుల్లో ఊరేగించి భక్తులిచ్చే కానుకలు స్వీకరిస్తారు. కార్యక్రమంలో సర్పంచ్ మామిడాల లింగారెడ్డి, ఎంపీటీసీ తాళ్లపెల్లి ఉమా సమ్మయ్య, తాళ్లపెల్లి సమ్మ య్య, సురేందర్,ఎండీ అన్సర్పాషా పాల్గొన్నారు.