నల్లబెల్లి, జూలై 1: ఆయిల్పామ్ సాగుతో రైతులు ఆర్థిక పరిపుష్టి సాధిస్తారని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. ఆయిల్పామ్ సాగుపై మండలకేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ ఆయిల్పామ్ సాగు వల్ల నాలుగేళ్ల తర్వాత ఇతర పంటలకు భిన్నంగా ఆదాయం సమకూరుతుందన్నారు.
ప్రభు త్వ ఉద్యోగికి నెలకు ఒకసారి జీతం వస్తే.. ఆయిల్పామ్ సాగు చేసిన రైతులకు రెండుమార్లు ఆదాయం వస్తుందన్నారు. ప్రధానంగా నీరు నిల్వ ఉండే నల్లరేగడి నేలలు తప్ప.. అన్ని రకాల భూముల్లో పంట సాగు చేసుకోవచ్చని సూచించారు. అలాగే, నీటి సౌకర్యం అధికంగా ఉండి గాలిలో తేమ ఉండే ప్రాంతాలు కూడా సాగుకు అనుకూలంగా ఉంటాయని వెల్లడించారు. తెలంగాణ ఆయిల్పామ్ యాక్టు 1993 ప్రకారం ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతు ప్రతినిధుల సమక్షంలో ఆయిల్పామ్ గెలల ధర నిర్ణయిస్తారన్నారు.
90 శాతం సబ్సిడీపై మొక్కలను అర్హులైన రైతులకు అందజేస్తారని చెప్పారు. ఎకరానికి సాగు ఖర్చు రూ. 20 వేలు కాగా, నికర ఆదాయం రూ. 1.20 లక్షల వరకు వస్తుందని వివరించారు. మొక్క నాటిన నాలుగేళ్ల నుంచి దిగుబడి మొదలై.. 30 ఏళ్ల వరకు రైతుకు పాడి గేదెల వలె నిరంతర ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు.
ఆసక్తిగల రైతులను ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తూ అన్నదాతలు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తుందని తెలిపారు. సమావేశంలో ఏడీఏ అవినాష్వర్మ, ఎన్ఎఫ్ఎస్ఎం కన్సల్టెంట్ సారం గం, జీవ ఎరువుల నియంత్రణ ప్రయోగశాల అధికారి పరమేశ్వర్, హార్టికల్చర్ అధికారి తిరుపతి, ఏవో పరమేశ్వర్, ఆర్బీఎస్ మండల కో ఆర్డినేటర్ గోనెల పద్మ-నరహరి, ప్రజాప్రతినిధులు, రైతులు, ఏఈవోలు పాల్గొన్నారు.