వరంగల్, జూన్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు హైదరాబాద్లో ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో హనుమకొండలో వెలిసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లు చర్చనీయాంశంగా మారాయి. బై బై మోదీ యాష్ టాగ్తో.. సాలు మోదీ, సంపకు మోదీ అని రాసిన ఫ్లెక్సీలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.
‘రైతు చట్టాలు తెచ్చి రైతులను చంపినవ్, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను రోడ్డు మీద పడేశావ్, పెద్ద నోట్ల రద్దని సామాన్యుల నడ్డి విరిచావు, హఠాత్తుగా లాక్డౌన్ అని సామాన్యులను చంపినవ్, నల్లధనం వెనక్కి తెచ్చి అందరి ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఏవి, నాలుగు సంవత్సరాలు కాంట్రాక్టు ఉద్యోగాలు మాత్రమే అని యువత కడుపు కొట్టినవ్’ నినాదాలతో ఈ ఫ్లెక్సీలు ఉన్నాయి. మోదీ ఫొటో, తెలుపు రంగు అక్షరాలు ఉన్న నలుపు రంగు ఫ్లెక్సీలు నక్కలగుట్టలోని డివైడర్లో ఏర్పాటు చేశారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. వరంగల్ మహానగరంలో బై బై మోదీ అని వేసిన ఫ్లెక్సీల్లోని అంశాలను పేర్కొంటూ యువకులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.