శాయంపేట, జూన్ 24 : దేశంలోనే సీఎం కేసీఆర్ది ఆదర్శన పాలన అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గట్లకానిపర్తి గ్రామంలో శుక్రవారం జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి రైతువేదికను ప్రారంభించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జడ్పీ హైస్కూల్, ప్రాథమిక పాఠశాలల్లో రూ.97 లక్షలతో చేపట్టిన తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.70 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ ఈ నెల 28న ప్రభుత్వం రైతు బంధు పథకం నిధులు విడుదల చేస్తుందని తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ను అడ్డుకునేందుకు కేంద్రం కుయుక్తులు పన్నుతోందని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదన్నారు.
వడ్లు కొనకుండా రైతులను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందన్నారు. అధికారం ముసుగులో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. అదానీ, అంబానీలపైనే ప్రేమ తప్ప రైతులు, కార్మికులపై లేదన్నారు. లాభాలతో నడుస్తున్న ఎల్ఐసీని అమ్మే కుట్ర చేస్తోందన్నారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాలతో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి చివరికి క్షమాపణ చెప్పిందన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని, సీఎం కేసీఆర్ను ఇబ్బంది పెడుతోందని పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదని, కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ ఊసే లేదన్నారు.
గట్లకానిపర్తిలో సీసీ, రైతుల ఫార్మేషన్ రోడ్ల నిర్మాణాలకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వానికి సాయం చేయాలన్న ఆలోచన కేంద్రానికి లేకపోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అంతకు ముందు ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. గదులు బూజు పట్టి ఉండడంతో ఎమ్మెల్యే గండ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఉండొద్దని శుభ్రం చేయించాలని కార్యదర్శికి సూచించారు. అనంతరం 8 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్ అందజేశారు.
సూరంపేటలో అడప లక్ష్మి కుటుంబాన్ని గండ్ర జ్యోతి పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. ఎంపీడీవో అమంచ కృష్ణమూర్తి, ఎంపీపీ తిరుపతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సారంగపాణి, డీఏవో రవీందర్సింగ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కర్ర ఆదిరెడ్డి, సర్పంచ్ బొమ్మకంటి సాంబయ్య, ఎంపీటీసీలు బత్తిని రజినీసత్యం, బాసాని చంద్రప్రకాశ్, గొట్టిముక్కుల స్వాతీవిష్ణువర్ధన్, వావిలాల వేణు, ఏఎంసీ వైస్ చైర్మన్ మారెపల్లి నందం, పీఆర్ డీఈ లింగారెడ్డి, ఏడీఏ రవీందర్, సర్పంచ్లు చిట్టిరెడ్డి రాజిరెడ్డి, రజిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మనోహర్రెడ్డి, నాయకులు రాంశెట్టి లక్ష్మారెడ్డి, గుర్రం అశోక్, అడుప ప్రభాకర్, గోలి మహేందర్రెడ్డి, వైనాల కుమారస్వామి, బుస్స సంపత్, పోతు రమణారెడ్డి, అజయ్, మిరిపల్లి కృష్ణ, ఏఈవోలు రజా, శివ, రాకేశ్ పాల్గొన్నారు.