తెలుగు నేలను ఏకం చేసి క్రీ.శ 750 నుంచి క్రీ.శ 1323వరకు ఘనమైన పాలన అందించిన కాకతీయుల వీర చరితను విశ్వవ్యాప్తం చేసేలా ‘కాకతీయ సప్తాహం’నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కాకతీయుల సెంటిమెంట్ అయిన 7 అంకె కలిసి వచ్చేలా ఏడో నెల ఏడో తేదీ నుంచి ఏడు రోజుల పాటు కాకతీయ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిపేందుకు ప్రణాళికలు వేసింది. నాటి పరిపాలన తీరు, కళా వైభవం, వ్యవసాయ రంగానికి కాకతీయులు ఇచ్చిన ప్రాధాన్యం, ఓరుగల్లు ప్రాముఖ్యతను చాటిచెప్పేలా వేడుకలు ఉండనున్నాయి. ఈ మేరకు సాంస్కృతిక శాఖ కాకతీయుల పరిపాలన అంశాలపై అవగాహన ఉన్న సాహితీవేత్తలను, కవులను ఉత్సవాల్లో భాగస్వాములను చేస్తున్నది.
వరంగల్, జూన్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాకర్త్య గుండన నుంచి ప్రతాపరుద్రుడి వరకు కాకతీయ రాజుల ఘన పరిపాలనను ప్రపంచానికి చాటేలా ఓరుగల్లు వేదికగా జూలై 7నుంచి వారం పాటు ‘కాకతీయ సప్తాహం’ పేరిట ఉత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. శాతవాహనుల తర్వాత తెలుగు జాతిని ఏకం చేసి ఏకచ్ఛత్రాధిపత్యం కిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులే. నాటి త్రిలింగ (ప్రస్తుత తెలంగాణను) ప్రాంతంలో కాకతీయుల ఘన వైభవం ఎలా ఉండేదో తెలిపేలా వేడుకల్లో ప్రతిబింబించేందు కు ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం రూపొందిస్తున్నది. ఓరుగల్లు ప్రాముఖ్యతను చాటిచెప్పేలా ఈ కార్యక్రమాలు ఉండనున్నాయి.
కాకతీయ పరిపాలన, అప్పటి కళావైభవం, గొలుసుకట్టు చెరువుల నిర్వహణ వంటి అంశాలు ఇప్పటితరం తెలుసుకునేలా ఏడు రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నారు. అన్ని అంశాలపై అందరికీ వివరించేలా ప్రత్యేకంగా సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఈమేరకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. వ్యవసాయరంగానికి కాకతీయులు ఇచ్చిన ప్రాధాన్యం, గొలుసుకట్టు చెరువుల నిర్మాణంతో సాగుకు భరోసా కల్పించిన తీరును ప్రత్యేకంగా వివరించనున్నారు. కాకతీయుల గొలుసుకట్టు చెరువుల స్ఫూర్తితో ‘మిషన్ కాకతీయ’ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించిన విధానంపైనా చర్చించనున్నారు.
కాకతీయుల హయాంలో నిర్మించిన చారిత్రక కట్టడాలు, వాటి ప్రాధాన్యతను అందరికీ తెలియజెప్పేలా సదస్సులకు నిపుణులను ఆహ్వానించనున్నారు. కాకతీయుల హయాంలో సైనికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పేరిణి నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని దాదా పు అందరు పేరిణి కళాకారులను ఆహ్వానించనున్నట్లు తెలిసింది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రదేశాల్లో కాకతీయుల ఉత్సవాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాకతీయుల కట్టడాలను పరిరక్షించేందుకు కాకతీయ సప్తాహంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాకతీయుల కట్టడాలు ఉన్న ప్రాంతాలను పరిశుభ్రంగా మార్చేందుకు స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి కాకతీయ కట్టడం పరిసరాలను ఆయా గ్రామాల్లోని వారు కలిసి శుభ్రం చేసేలా అందరినీ సమాయత్తం చేస్తున్నారు.
కాకతీయులు సెంటిమెంట్గా భావించిన 7 నంబర్ ఆధారంగా ఏడో నెల, ఏడో తేదీ నుంచి ఏడు రోజులపాటు కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏడురోజుల కార్యక్రమాలపై త్వరలోనే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశం కానున్నారు. రూపొందిస్తున్న ప్రణాళికపై చర్చించి అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్లో ఉంటున్న కాకతీయుల వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ కాకతీయను ఉత్సవాలకు ఆహ్వానించారు. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయభాస్కర్ స్వయంగా బస్తర్ వెళ్లి కమల్చంద్ర భంజ్దేవ్తో చర్చించి ఆహ్వాన ప్రతికను అందజేశారు. కాకతీయుల పరిపాలన, ఇతర అంశాలపై అవగాహన ఉన్న సాహితీవేత్తలను, కవులను ఉత్సవాల్లో భాగస్వాములను చేసేందుకు సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. తెలంగాణ భాషా సాంసృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ దీనిపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.