జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతున్నది. ఒక్కసారి పెట్టుబడితో ఏళ్ల తరబడి ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. మొక్కలు, వాటి పోషణ దగ్గర నుంచి అంతరపంటల సాగు వరకు సబ్సిడీలు, రాయితీలతో రాష్ట్ర సర్కారు ప్రోత్సహిస్తుండడంతో ముందుకొస్తున్నారు. 2020-21లో 305 ఎకరాలు, 2021-22లో 701 ఎకరాల్లో సాగు కాగా, ఈ ఏడాది 7,650ఎకరాల్లో సాగుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే జిల్లాలో సాగుకు అనువైన 5వేల ఎకరాల భూములను గుర్తించగా, మరో 2,650 ఎకరాల కోసం సర్వే చేస్తున్నారు. ఇక తొర్రూరు మండలం హరిపిరాలలో ఆయిల్పామ్ మొక్కల కోసం నర్సరీని ఏర్పాటు చేసి, సుమారు 4లక్షల మొక్కలు పెంచుతున్నారు. ఇందులో 9నెలల మొక్కలు 1.10లక్షలు, 6నెలల మొక్కలు 1.30లక్షలు, 5 నెలల మొక్కలు రూ.1.60లక్షలు ఉన్నాయి. వీటిని సబ్సిడీపై దశలవారీగా రైతులకు అందించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మహబూబాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : సంప్రదాయ పంటల సాగుతో విసిగిపోయిన అన్నదాతలను ఇతర పంటల వైపు మళ్లించేలా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నది. వీటిలో ఆయిల్పామ్ ఒకటి. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకిది ఆశాకిరణంలా మారింది. ఒకసారి పెట్టుబడితో ఏళ్ల తరబడి లాభాలు వచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అనేక రకాలుగా ప్రోత్సహిస్తున్నది.
సబ్సిడీలు, రాయితీలు అందిస్తున్నది. ఈ ఏడాది రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాలని నిర్ణయించిన సర్కార్ అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లాలో ఈ సంవత్సరం 7,650 ఎకరాలు సాగులోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. 2020-21లో 305 ఎకరాలు, 2021-22లో 701 ఎకరాలు సాగు కాగా, ఈ ఏడాది మరిన్ని ఎకరాల భూమి సాగులోకి తెచ్చేలా ముందుకెళ్తున్నారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో సర్వే చేసి 5వేల ఎకరాల భూములను గుర్తించిన అధికారులు, మరో 2,650 ఎకరాల భూమి కోసం సర్వే చేస్తున్నారు.
ఇందులో ఆగస్టులో 2,550 ఎకరాలు, సెప్టెంబర్లో 2,550, అక్టోబర్లో 1,700 ఎకరాలు, వచ్చే ఏడాది జనవరిలో 850 ఎకరాలు సాగులోకి తెచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఇక ఆయిల్పామ్ సాగుకు ముందుకొచ్చే రైతులను సబ్సిడీలతో ప్రోత్సహిస్తున్నది. ఆయిల్పామ్ సాగుకు ఎకరాకు 50 మొక్కలు అవసరం కాగా, ఒక మొక్క ధర రూ.193 ఉంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.173 సబ్సిడీ రూపంలో అందిస్తుండగా, రైతు ఒక మొక్కకు కేవలం రూ.20 చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఎకరాకు రైతు రూ.వెయ్యి చెల్లిస్తే, మిగతా డబ్బులు ప్రభుత్వం సబ్సిడీ కింద అందజేస్తుంది. మొక్కల పోషణ, అంతర పంటల సాగు కోసం ఎకరాకు అదనంగా రూ.4,100 నాలుగు సంవత్సరాలపాటు అందజేస్తుంది.
అంతేకాకుండా డ్రిప్ కోసం ఎకరాకు రూ.25వేలు ఖర్చవుతుండగడా, ఇందులో ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.4 నుంచి రూ.5వేల వరకు, సన్న, చిన్నకారు, బీసీ రైతులకు రూ.7 నుంచి రూ.8వేల వరకు ఇతర రైతులకు రూ.8 నుంచి రూ.10వేలు చెల్లిస్తే మిగతా డబ్బులు సంబంధిత రైతులకు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందిస్తున్నది. ఇక ఆయిల్పామ్ మొక్కల కోసం తొర్రూరు మండలం హరిపిరాలలో నర్సరీ ఏర్పాటు చేసి, సుమా రు నాలుగు లక్షల మొక్కలు పెంచుతున్నారు.
ఇందు లో 9 నెలల వయసు ఉన్న మొక్కలు 1.10లక్షలు, 6నెలల మొక్కలు 1.30లక్షలు, 5 నెలల మొక్కలు రూ.1.60లక్షలు ఉన్నాయి. వీటిని దశలవారీగా రైతులకు అందించనున్నారు. గతంలో ఆయిల్పామ్ మొక్కలను అశ్వరావుపేటలోని నర్సరీల నుంచి తీసుకొచ్చేవారు. ఇప్పుడు జిల్లాలోని హరిపిరాలలో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. దీంతో రైతులకు వ్యయప్రయాసలు తప్పనున్నాయి. ఈ ఏడాది నుంచి ఇక్కడి మొక్కలనే నాటేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
జిల్లాలో ఏటా ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. రైతులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. 2020-21లో 305 ఎకరాలు, 2021-22లో 701 ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 7,650 ఎకరాల్లో సాగులోకి తేచ్చేలా ప్రణాళిక రూపొందించాం. ఇందుకోసం ఇప్పటికే రైతులను గుర్తించి వారి భూములను సర్వే చేశాం. ఈ ఏడాది ఆగస్టులో 2,550 ఎకరాలు, సెప్టెంబర్లో 2,550, అక్టోబర్లో 1,700, వచ్చే ఏడాది జనవరిలో 850 ఎకరాల్లో సాగుచేసేలా ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో రైతులు ఉత్సాహం చూపుతున్నారు.
– ఉద్యానశాఖ జిల్లా అధికారి, సూర్యనారాయణ