వరంగల్, జూన్ 21: సిటిజన్ చార్ట్ను పటిష్టంగా అమలు చేసి నగర ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో కమిషనర్ ప్రావీణ్యతో కలిసి మంగళవారం ఆమె పన్నుల విభాగం అధికారులతో సమీక్షించారు. పన్నుల విభాగంలో పెండింగ్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని మేయర్ సూచించారు. పేరు మార్పిడి, బైఫర్కేషన్, కొత్త ఇంటి నంబర్ల కేటాయింపు పనులను పారదర్శకంగా చేపట్టాలన్నారు. సిటిజన్ చార్ట్ ప్రకారం వారికి పనులు జరుగాలని ఆదేశించారు.
నిబంధనల మేరకు పౌర సేవలు పారదర్శకంగా అందించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆమె హెచ్చరించారు. కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న 615, కాజీపేట సర్కిల్ కార్యాయంలో ఉన్న 353 ఫైళ్లను వేగంవంతగా పరిష్కరించాలని ఆదేశించారు. సిబ్బందిపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే డిప్యూటీ కమిషనర్లు విచారణ చేపట్టాలన్నారు. ఇప్పటికే గ్రేటర్లో 67 శాతం గృహాల జియో ట్యాగింగ్ పూర్తయిందని, త్వరగా వందశాతం పూర్తి చేయాలన్నారు. పన్నుల వసూళ్లపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, డిప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్రెడ్డి, ఐటీ మేనేజర్ రమేశ్, రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
వర్షాకాలం నేపథ్యంలో లోతట్టు ప్రాంతా ల ప్రజల ఇబ్బందులపై ఎప్పటికప్పుడు స్పందించి సత్వర సేవలు అందించేందుకు బల్దియా ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య తెలిపారు. ఆపదలో ఉన్న వారు టోల్ఫ్రీ నంబర్లు 18004251980, 9701999645 మొబై ల్ నంబర్, 7997100300 వాట్సాప్ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. కంట్రోల్ రూంలో 24 గంటలూ పని చేస్తుందని తెలిపారు.
పోచమ్మమైదాన్: వరంగల్ పోచమ్మమైదాన్ ఏరియాలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న శానిటేషన్ పనులను మేయర్ గుండు సుధారాణి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎల్బీనగర్, కాశీబుగ్గ, పోచమ్మమైదాన్, బ్యాంకుకాలనీ-1, కొత్తవాడ, దేశాయిపేటను సందర్శించి, శానిటేషన్ పనులను పరిశీలించారు. స్థానిక కార్పొరేటర్ల ద్వారా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వర్షాకాలం దృష్టా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పారిశుధ్య పనులను చేయించుకోవాలని సూచించారు. అలాగే, అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఆయా డివిజన్లలో యుద్ధప్రాతిపదికన పనులు చేయించాలని ఆదేశించారు. వీరి వెంట కార్పొరేటర్లు బస్వరాజు కుమారస్వామి, సురేశ్కుమార్జోషి ఉన్నారు.