‘పల్లె ప్రగతి’తో నెక్కొండ మండలం పెద్దకొర్పోలు.. అభివృద్ధి పథంలో పయనిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేస్తున్న నిధులతో మౌలిక సదుపాయాలు సమకూరడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామం సరికొత్తగా మారింది. ఆహ్లాదం పంచే పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, డంపింగ్ యార్డు, చివరి కష్టాలు తీర్చే వైకుంఠధామం ఏర్పాటయ్యాయి. పాలకవర్గ సభ్యుల కృషి, అధికారుల తోడ్పాటు, ప్రజల భాగస్వామ్యంతో ఆదర్శ గ్రామం దిశగా రూపుదిద్దుకుంటోంది.
– నెక్కొండ, జూన్ 21
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో పల్లెలు, పట్టణాల తరహా వడివడిగా అభివృద్ధి చెందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో పల్లెల రూపురేఖలు మారుతున్నాయి. పల్లెల్లో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు సుందరీకరించే లక్ష్యంతో ప్రభుత్వం విడుదల చే స్తున్న నిధులను పంచాయతీలు సద్వినియోగం చేసుకుంటుండడంతో పల్లెలు కొత్తశోభను సంతరించుకుంటున్నా యి. ఇదే తరహాలో నెక్కొండ మండలం పెద్దకొర్పోలు గ్రామం నూటికి నూరు శాతం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతోంది.
గ్రామ సర్పంచ్ మహబూబ్ పాషా చొరవతో ఉప సర్పంచ్ ఇంద్రసేనారెడ్డి, పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. రూ.12లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో వైకుంఠధామం నిర్మించారు. తాగునీటి వసతిని కల్పించాల్సి ఉంది. అలాగే రూ.15 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, రూ.20 లక్షల గ్రామ పంచాయతీ నిధులను వినియోగించి వీధుల్లో కొత్తగా సీసీరోడ్లు వేయించారు.
రూ.2.50 లక్షలతో డంపింగ్యార్డ్ నిర్మించారు. యార్డ్లో ప్లాస్టిక్ను వేరుచేయడంతో పాటు సేంద్రియ ఎరువును సైతం తయారు చేస్తున్నారు. పల్లెప్రకృతి వనం, హరితహారం మొక్కలతో పాటు రైతులు తమ పొలాలకు సేంద్రియ ఎరువును వినియోగించుకుంటున్నారు. రూ.5.35 లక్షలను వెచ్చించి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ను, రూ.1.70లక్షలతో ట్రాక్టర్ ట్రాలీని, రూ.1.80లక్షలతో వాటర్ ట్యాంకర్ను కొనుగోలు చేశారు.
వీటితో పల్లెప్రకృతి వనం సంరక్షణ, హరితహారంలో ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటేషన్తో పాటు ప్రధాన రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలకు నీళ్లు పడుతున్నారు. ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్ కొనుగోలుతో ఏటా చెత్తాచెదారం తొలగించేందుకు వెచ్చించే లక్ష రూపాయలు జీపీకి ఆదా అవుతున్నాయి. గ్రామంలో రూపుదిద్దుకున్న పల్లెప్రకృతి వనం ఆహ్లాదం పంచుతుండడంతో పిల్లలు, పెద్దలు సరదాగా గడి పేందుకు వస్తున్నారు. ప్రకృతివనంలో పూలు, పండ్ల చెట్లతోపాటు షో చెట్లను సైతం పెంచుతుండడంతో గ్రామస్తులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తోంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏటా 10వేలకు పైగా మొక్కలు నాటి సంరక్షిస్తుండడంతో గ్రామం పచ్చదనంతో పరిఢవిల్లుతోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం గ్రామంలోనే కస్తూర్బా బాలికల గురుకులాన్ని అన్ని వసతులతో ఏర్పాటుచేసింది.
ప్రస్తుతం మన ఊరు-మన బడి ద్వారా ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లక్షలాది నిధులను వెచ్చించి అభివృద్ధి పనులు చేసేందుకు సమాయత్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల నిధులు, రూ.12లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కలుపుకొని మొత్తం రూ.22 లక్షలతో రైతువేదిక నిర్మించారు. రైతువేదిక ఏర్పాటుతో పంటలసాగులో వస్తున్న మార్పులను రైతులకు ఎప్పటికప్పుడు వివరిస్తూ, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఉపయోగపడుతోంది. వ్యవసాయశాఖ ద్వారా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇలా పాలకవర్గంతోపాటు గ్రామస్తులు గ్రామాభివృద్ధికి సహకరిస్తూ పెద్దకోర్పోలును అన్ని విధాలా బాగుచేసుకుంటున్నారు.
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సహకారంతో అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. గ్రామంలో రూ.8కోట్లతో గోదాముల నిర్మాణం కొనసాగుతోంది. దీని వల్ల పెద్దకొర్పోలుతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఉపాధి దొరుకుతుంది. రైతు వేదికతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని, ఎన్ఆర్ఈజీఎస్ నిధులను సద్వినియోగం చేసుకోవడంతో గ్రామంలో మౌలిక సదుపాయాలు సమకూరాయి. సీసీరోడ్ల నిర్మాణానికి నిధులు కావాల్సి ఉంది. పచ్చదనం, పరిశుభ్రంతో గ్రామం పరిఢవిల్లాలని కోరుకుంటున్నాం.
– మహబూబ్ పాషా, సర్పంచ్